పెట్రో ధరల మోతపై జగన్ కీలక నిర్ణయం..! రేపు రాష్ట్రమంతా..!
ఇరాన్-అమెరికా యుద్దం కారణంగా దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎక్కువగా ఉన్న చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు వ్యాట్ నాలుగు శాతం, రోడ్డు సెస్ రూపాయి తగ్గించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ (YSRCP) సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది.
ఇవాళ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడానికి బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింత భారమవుతోందన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రేపు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి, అనంతరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారు ఇచ్చిన అదే హామీని అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు. రేపు నిర్వహించే నిరసన కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలని, వినూత్నంగా చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications