జగన్ వెళ్లకముందే టీడీపీ- వైసీపీ రచ్చ రచ్చ..! ఎవరేమన్నారంటే ?
ఏపీలో ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తోతాపురి మామిడి రైతుల పరామర్శకు జగన్ పర్యటన రాజకీయంగా మాటల దాడికి కారణమవుతోంది. జగన్ రాక కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కానీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తుంటే.. తోతాపురి మామిడి పండ్లు, మద్దతుధరపై అవగాహన లేకుండా వైసీపీ విమర్శలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ టూర్ పై కూటమిలోని మరో రెండు పార్టీలు జనసేన, బీజేపీ మాత్రం మౌనంగా ఉన్నాయి.
జగన్ బంగారుపాళ్యం టూర్ పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు లేని పోని ఆరోపణలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని APSAM వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు మద్దతుగా కిలో రూ.12 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇందులో రూ.8 ఫ్యాక్టరీలు చెల్లిస్తాయని, మిగిలిన రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ రైతులను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటకలో మామిడి కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్నారని తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నారు. వాస్తవంగా కర్ణాటకలో మండీలలో కిలో రూ.2, ఫ్యాక్టరీలలో రూ.4కు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కిలో రూ.12 ధరతో రైతులకు మద్దతు ఇస్తున్నట్లు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రజలను కోరుతున్నామని ఆయన కోరారు.
మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కూడా జగన్ బంగారుపాళ్యం టూర్ పై తీవ్రంగా స్పందించారు. మామిడి కాయల్లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. బంగారుపాళ్యంలో ఈ నెల 9న మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరుతుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గందరగోళం రేపడానికే జగన్ రెడ్డి ఈ టూర్ కు ప్లాన్ చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించే తీరు వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్లు ఉందన్నారు. అసలు మామిడి పంట గురించి, వ్యవసాయం, రైతుల గురించి జగన్మోహన్ రెడ్డికి సరైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు రానున్న వైయస్ జగన్ కోసం జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రైతులు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా నిర్లక్ష్యంతో ఉండటంతో పూర్తిగా నష్టపోయిన రైతులు తమ ఇబ్బందులను ప్రతిపక్ష నేతకు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రైతులు వైయస్ జగన్ పర్యటన రోజున బంగారుపాళ్యంకు వచ్చి, తమ గోడును వెళ్ళబోసుకోవాలనే దోరణితో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులతో సమావేశాలు నిర్వహించడం, పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్ళు చేయిస్తామంటూ ప్రకటనలు చేయించడానికే పరిమితమైందన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పిన రేటుకు మామిడి కొనుగోళ్లు జరగడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. తమకు తెలిసినంత వరకు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎన్నడూ మామిడి రైతులకు ఎదురుకాలేదన్నారు. దీనిని ఒక విపత్తుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా రైతులకు భరోసా కల్పించడం, వారికి అండగా నిలవడం కోసమే ఆయన పర్యటన అన్నారు.
వైయస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోందని పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ వస్తున్నాడని తెలిసి, ఆయన పర్యటనకు అనేక ఆటంకాలు కల్పించారన్నారు. పోలీస్ అనుమతులు ఇవ్వడంలోనూ పలు అభ్యంతరాలు కల్పించారన్నారు. చంద్రబాబు హుటాహుటిన చిత్తూరు జిల్లాకు వచ్చి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామంటూ వాగ్ధానాలు చేయడం, దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకోవడం చేశారన్నారు. కానీ వాస్తవానికి ఎక్కడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదన్నారు.












Click it and Unblock the Notifications