వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు ? అరెస్టు చూపాక- బొత్స సంకేతాలు
సొంత కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు విచారిస్తున్నారు. కాకినాడలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏలూరు డీఐజీ పాలరాజు ఆయన్ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత అనంతబాబును అరెస్టు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన్ను సస్పెండ్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
అనంతబాబు రాత్రికి అరెస్టు?
వ్యక్తిగత కారణాలతో కారు డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన్ను ఇవాళ ఉధయం నుంచి కాకినాడలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. ఆయన నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆయన డ్రైవర్ ను వ్యక్తిగత కారణాలతోనే చంపేసినట్లు అంగీకరించినందున.. ఆయన్ను అరెస్టు చేయడం లాంఛనమేనని తెలుస్తోంది. ఈ రాత్రికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన అరెస్టు చూపే అవకాశముంది.
మండలి ఛైర్మన్ కు సమాచారం
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్న పోలీసులు.. ముందుగా ఈ సమాచారాన్ని మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజుకు తెలియజేయనున్నారు. ఈ సాయంత్రం ఎమ్మెల్సీ చేసిన డ్రైవర్ హత్య, అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మండలి ఛైర్మన్ కు తెలియజేసి ఆయన అనుమతి తీసుకోబోతున్నారు. అనంతరం ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
సస్పెన్షన్ పై బొత్స సంకేతాలు
కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్టు కాబోతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేసేందుకు అధిష్టానం సిద్దమవుతోంది. కారు డ్రైవర్ హత్య కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన అనంతబాబు ఇప్పటికే పోలీసుల ముందు కూడా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఆయనపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయనున్నారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. సంకేతాలు ఇఛ్చేశారు. అరెస్టు తర్వాతే సస్పెన్షన్ ఉంటుందన్నారు.