ఈ నెల 21న కాదు, సోమవారమే అవిశ్వాస తీర్మానం: బొత్స ప్రకటన
అమరావతి: తాము కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21 కంటే ముందే అవిశ్వాస తీర్మానం పెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ శుక్రవారం చెప్పారు.
అవిశ్వాసం తీర్మానం అనంతరం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు. వచ్చే సోమవారమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. అలాగే, టీడీపీ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతామని, అవిశ్వాసానికి మద్దతు ఇస్తారో లేదో చంద్రబాబే తేల్చుకోవాలన్నారు.
కేంద్ర మంత్రులుగా టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఏపీకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఏమీ చేయలేకపోయారన్నారు.
భోగాపురం విమానాశ్రయం పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేయాలని భావించారన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిద్దరూ సంతృప్తిగా లేరన్నారు.
ప్రత్యేక హోదా కోసమే మంత్రి పదవులకు రాజీనామా చేశామని వారు చెప్పుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు ఓ మాట, ఢీల్లీలో ఎంపీలు మరో మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకే రాజీనామాలు చేస్తున్నామని ప్రధానికి ఎందుకు చెప్పలేదన్నారు.