ఇడుపులపాయలో వైఎస్ షర్మిల..విజయమ్మ: తండ్రికి నివాళి: అన్న రికార్డు బ్రేక్
కడప: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి ఆమె తెలంగాణలో మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టౌన్లోని శంకర్పల్లి చౌరస్తా వద్ద ప్రజా ప్రస్థానం మొదలవుతుంది. వైఎస్ విజయమ్మ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఈ పాదయాత్రకు ముందు ఆమె తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. దీనికోసం ఈ ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి తల్లి విజయమ్మతో కలిసి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి వచ్చారు. రోడ్డు మార్గంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పులివెందుల నుంచి వచ్చిన కొద్దిమంది కుటుంబ సభ్యులను ఇడుపులపాయ గెస్ట్హౌస్లో కలుసుకున్నారు. తన పాదయాత్రకు సంబంధించిన వివరాలపై క్లుప్తంగా మాట్లాడారు. 400 రోజుల పాటు తాను పుట్టినింటికి దూరంగా ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తండ్రి చూపిన అడుగు జాడల్లో నడుస్తానని, ఆయన ఆశయాలకు అనుగుణంగా.. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
తండ్రి అడుగుజాడల్లో నడపాలనే ఉద్దేశంతోనే తన పాదయాత్రను మొదలు పెట్టడానికి చేవెళ్లను ఎంచుకున్నానని, నాన్నగారి ఆశీస్సులతో ఈ పాదయాత్ర విజయవంతం అవుతుందని షర్మిల ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో గ్రామస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడానికి అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం.. కేసీఆర్ ప్రభత్వం దృష్టికి వాటిని తీసుకెళ్లడం వంటి చర్యలను తీసుకుంటామని సన్నిహితులకు వివరించారు.
కాగా.. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు వైఎస్ షర్మిల పాదయాత్ర మొదలు పెడతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మళ్లీ 3 గంటలకు పాదయాత్రను మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తారు. పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు.