స్థానిక పోరులో స్వల్ప ఘర్షణలు: పోలింగ్ పూర్తి
సాయంత్రారం 5గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్ట్లుయే అవకాశం ఉందని ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా బండ్ల వీధిపల్లి, మెదక్ జిల్లా వెల్దుర్తి, విజయనగరం జిల్లా రావివలస, నెల్లూరు జిల్లా కలువాయి, టెక్కలిలలో ఏప్రిల్ 13న, విశాఖపట్నం జిల్లా ముంచంగిపట్టులో ఏప్రిల్ 16న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సుంకిరెడ్డి పాలెంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఏజెంట్లను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. స్వతంత్ర అభ్యర్థికి హస్తం గుర్తు కేటాయించడంతో టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రాలను సరిచేసి మూడున్నర గంటల ఆలస్యంగా తిరిగి పోలింగ్ ప్రారంభించారు.
గుంటూరు జిల్లాలోని క్రోసూరు-2 ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చీరలు పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న ఆరోపణతో టిడిపి అభ్యర్థి కొమ్మినేని విజయలక్ష్మి ఇంటిపై రాళ్లదాడి చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చూశారు. పిడుగురాళ్ల మండలం జానపాడులో పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ టిజివి కృష్ణారెడ్డిని టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ కొండా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం మండలం కొగటంలో ఎమ్మెల్యే వీరశివారెడ్డిని, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ఇనగలూరులో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం బండమీదిపల్లిలో రీపోలింగ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. శింగనమల జడ్పిటిసి స్థానానికి ఆత్మకూరు బ్యాలెట్ పేపర్లు రావడంతో పోలింగ్ నిలిపేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకుడిమి కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిపివేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.