బెంగళూరు అల్లర్లు: కర్ణాటక కీలక నిర్ణయం - యోగి బాటలో యెడ్డీ - నవీన్ సహా 146 అరెస్ట్
దేశ సాకేతిక రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిటీలోని పులకేశినగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మంగళ, బుధవారాల్లో చోటుచేసుకున్న విధ్వంసకాండలో జరిగిన నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విధానాన్ని అవలంభించగా, ఇప్పుడు కర్ణాటకలోని యడ్యూరప్ప సర్కారు కూడా దాన్ని ఫాలో అవుతున్నది. అల్లర్లకు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మెజిస్టీరియల్ ఎంక్వైరీ..
‘‘నిమిషాల వ్యవధిలోనే వేల మంది పోగై, పెట్రోల్ బాంబులు, రాళ్లతో విధ్వంసం సృష్టించిన తీరును చూస్తే, ఇవి పక్కాగా ప్లాన్ చేసిన అల్లర్లని స్పష్టమవుతున్నది. 300కు పైగా వాహనాలు, ఆస్తులు కాలిబూడిదైపోయాయి. జరిగిన నష్టంలో ప్రతిపైసా నిందితుల నుంచే వసూలు చేస్తాం. కుట్రకు సంబంధించిన విషయాలు కూడా విచారణలో బయటపడతాయి''అని మంత్రులు సీటీ రవి, ఆర్.అశోకా మీడియాతో అన్నారు. బెంగళూరు అల్లర్లపై పోలీసుల విచారణకు విడిగా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని మరో మంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.

నవీన్ సహా 146 మంది అరెస్ట్..
బెంగళూరులో తాజా హింసకు అసలు కారకుడైన నవీన్ అనే వ్యక్తితోపాటు మొత్తం 146 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి బంధువైన నవీన్.. మొహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వివాదం రాజుకుంది. నవీన్ పై చర్యలు కోరుతూ వీధుల్లోకి వచ్చిన మూకలు.. ఎమ్మెల్యే ఇంటితోపాటు, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పైనా దాడికి దిగారు. ఆయా ప్రాంగణాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది వాహనాలను తగులబెట్టారు. అల్లర్లను అదుపుచేసేక్రమంలో పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
Recommended Video

బీజేపీ-కాంగ్రెస్ గేమ్ అన్న ఎస్డీపీఐ
పులికేశినగర్ హింసకు సూత్రధారులంటూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)పై ఆరోపణలు వచ్చాయి. ఆ పార్టీ నేత ముజామిల్ పాషాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే, హింసతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా బీజేపీ- కాంగ్రెస్ ఆడిస్తోన్న గేమ్ అని, అనవసరంగా అమాయకులైన ముగ్గురు యువకులు బలైపోయారని ఎస్డీపీఐ కార్యదర్శి వసీమ్ అహ్మద్ మీడియాతో అన్నారు. ధ్వంసరచన చేసింది ఎవరో వీడియోలు చూస్తే తెలిసిపోతుందని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications