సడన్గా ఢిల్లీకి యడియూరప్ప: కర్ణాటక ముఖ్యమంత్రికి ఉద్వాసన మార్పు తప్పదా?
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఉద్వాసన తప్పదంటూ కొద్దిరోజులుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో ఆయన సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రత్యర్థులు విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధిస్తోన్న నేపథ్యంలో- యడియూరప్పను సాగనంపుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యవహారం తెర మీదికి వచ్చింది. కరోనా వైరస్ తీవ్రత సద్దుమణిగిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పుపై దృష్టి సారించిందని తెలుస్తోంది.

తీరథ్ సింగ్ రావత్ తరహాలో..
యడియూరప్ప హఠాత్తుగా హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్తోండటం.. ఈ ప్రచారానికి, అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇదివరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ను ఏరకంగానైతే బీజేపీ అధిష్ఠానం ఢిల్లికి పిలిపించుకుని ఉద్వాసన పలికిందో.. అదే తరహాలో యడియూరప్పకు సాగనంపుతారనే ప్రచారం సాగుతోంది. తాను ఢిల్లీకి వెళ్లాల్సి ఉందనే విషయాన్ని యడియూరప్ప సైతం స్పష్టం చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి మార్పు వార్తలను మాత్రం కొట్టి పారేశారు. అలాంటిదేమీ ఉండదని, దీనిపై తన వద్ద ఎలాంటి సమాచారం కూడా లేదని తేల్చి చెప్పారు.

మేకెదాటు ప్రాజెక్ట్ కోసమే..
ఈ సాయంత్రం 5 గంటలకు యడియూరప్ప బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుంటారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్లను ఆయన కలుసుకోవాల్సి ఉంది. తమిళనాడు-కర్ణాటక మధ్య మేకేదాటు ప్రాజెక్టు వివాదం తలెత్తిన నేపథ్యంలో- యడియూరప్ప ఢిల్లీకి వెళ్తోన్నప్పటికీ.. ముఖ్యమంత్రి మార్పు తప్పకపోవచ్చంటూ ప్రచారం ఉండటం, దాన్ని బీజేపీ నేతలెవరూ తోసిపుచ్చకపోవడం చర్చనీయాంశమౌతోంది.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ ఛాన్స్?
కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. దేశంలోకెల్లా అత్యధిక మరణాలు నమోదైన మెట్రోసిటీల్లో బెంగళూరు టాప్లో ఉందంటూ ఇదివరకు కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించడాన్ని బీజేపీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుందని, దానికి సంబంధించిన డేటాను తెప్పించుకుందని అంటోన్నారు. అదే సమయంలో- కర్ణాటక మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలనే కారణంతోనే యడియూరప్ప హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

మేకెదాటు ప్రాజెక్ట్పై
మరో రెండేళ్లలో ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నందున- యడియూరప్ప తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారని, దీనికి సంబంధించిన జాబితాపై పార్టీ అధిష్ఠానం నుంచి ఆమోదం పొందడానికే హస్తిన పర్యటనను తలపెట్టారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. కావేరి నదిపై తాము నిర్మంచ తలపెట్టిన మేకెదాటు ప్రాజెక్ట్కు తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోందనే విషయాన్ని కూడా యడియూరప్ప కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. ఆయన పర్యటన మాత్రం ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే.. యడియూరప్ప కంట బలమైన నాయకుడు ఎవరున్నారనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications