విషమంగానే బీజేపీ ఎంపీ అశోక్ గస్తి ఆరోగ్యం: ఆస్పత్రి వర్గాలు, మరణించారంటూ మీడియా కథనాలు
బెంగళూరు: కరోనాతో బాధపడుతున్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ గుస్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఏడాది జూన్ నెలలోనే ఆయన మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
సెప్టెంబర్ 2న కరోనా సోకడంతో అశోక్ గస్తి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన ఇటీవల ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ఇది ఇలావుంటే, పలు మీడియా ఛానళ్లు ఆయన కరోనాతో మరణించారంటూ వార్తలు ప్రసారం చేశాయి.

ఈ క్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే, ఆ తర్వాత అశోక్ గస్తి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి చెందిన అశోక్ గస్తి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కర్ణాటకలో చాలా మందికి అశోక్ గస్తి గురించి తెలీదు. వివాదాలకు, గ్రూపు రాజకీయాలకు అశోక్ గస్తి చాలా దూరంగా ఉంటారు. తనపని తాను చేసుకు వెలుతున్న అశోక్ గస్తి గత రాజ్యసభ ఎన్నికల పోటీలో అసలు లేరు.
కర్ణాటక శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలని చాలా మంది బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేశారు .అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ హైకమాండ్ అశోక్ గస్తి పేరు సూచించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు. సామాన్య కార్యకర్తలకు కూడా మేము గుర్తింపు ఇస్తామని అశోక్ గస్తిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేసిన బీజేపీ హైకామండ్ అందరికి ఊహించని షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications