Siddaramaiah biopic: లీడ్ క్యారెక్టర్లో పాన్ ఇండియా హీరో: పోస్టర్ రిలీజ్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత- ప్రచారం ఊపందుకుంది. భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ముందంజలో ఉంటోంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస కైవసం చేసుకుంటుందని తెలిపింది. బీజేపీ ఈ దఫా ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కమలానికి 90 స్థానాలు లోపే దక్కుతాయని అభిప్రాయపడింది.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్కు మరింత ఊపు ఇచ్చే సమాచారం వెలువడింది. కాంగ్రెస్ స్టాల్ వార్, శాసన సభలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య జీవిత చరిత్రపై ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆయన బయోపిక్ తెరకెక్కనుంది. కొప్పల్ జిల్లాలోని కనకగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ తంగడగి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. దీనికి సత్యరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఆయనే ఈ సినిమాకు కథను సమకూర్చారు. ఇదివరకు కథాలేఖన సినిమాకు దర్శకత్వం వహించారు సత్యరత్నం.

ఈ మూవీకి లీడర్ రామయ్య అనే టైటిల్ ను ఖాయం చేశారు. ఎ కింగ్ రైజ్డ్ బై ద పీపుల్ అనేది ట్యాగ్ లైన్. పాన్ ఇండియా గుర్తింపు పొందిన తమిళ హీరో విజయ్ సేతుపతి- ఈ సినిమాలో సిద్ధరామయ్య క్యారెక్టర్ లో నటించే అవకాశం ఉంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆయనను సంప్రదించారు కూడా. ఇందులో నటించే విషయంలో విజయ్ సేతుపతి ఇంకా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కాగా- ఈ సినిమా చిత్రీకరణకు అవసరమైన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. స్క్రిప్ట్ కూడా రెడీ అయింది.
ఈ సినిమాకు సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇదివరకు ఆయనను సినిమాల్లో నటింపజేయడానికి కొందరు నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించారు గానీ అవి వాస్తవ రూపాన్ని దాల్చలేదు. తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఏ మాత్రం లేదంటూ సిద్ధరామయ్య పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా తన రాజకీయ జీవితంపై బయోపిక్ ను తెరకెక్కించడానికి సిద్ధరామయ్య సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కురుబ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య. 2013 నుంచి 2018 మధ్యకాలంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. అయిదు సంవత్సరాల పూర్తికాలం పాటు కొనసాగిన అతి కొద్దిమంది ముఖ్యమంత్రుల్లో ఆయనా ఒకరు. 2018 ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కాంగ్రెస్- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత బీజేపీ- ఆపరేషన్ లోటస్ ను చేపట్టడం, కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం తెలిసిందే.












Click it and Unblock the Notifications