కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం
కర్ణాటక డీజీపీగా పని చేస్తోన్న ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతరోజే ఆయన్ని డైరెక్టర్ గా ఎంపిక చేయడం విశేషం. 1986 కర్ణాటక బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకటన చేసింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఉన్నారు. ఈనెల 25వ తేదీతో ఆయన పదవీకాలం ముగియబోతోంది. అనంతరం ప్రవీణ్ సూద్ బాద్యతలు స్వీకరిస్తారు.
డీజీపీ ప్రవీణ్ సూద్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారంటూ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మార్చి నెలలో ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాతే ప్రవీణ్ వార్తల్లోకెక్కారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించిన డీకే ప్రవీణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి మోడీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఈనెల 13వ తేదీన సీబీఐ కొత్త డైరెక్టర్గా ప్రవీణ్ పేరును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ కుమార్ సక్సేనా; ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా పని చేస్తోన్న తాజ్ హసన్ పేర్లను సైతం సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలించారు. ప్యానెల్ చివరకు ప్రవీణ్ వైపు మొగ్గింది. రెండు సంవత్సరాల కాలానికి డైరెక్టర్ ను ఎంపిక చేస్తారు. అవసరమనుకుంటే మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తారు.
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. మొత్తం 224 నియోజకవర్గాలకుగాను 135 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. భారతీయ జనతాపార్టీ 66 స్థానాలకు పరిమితమవగా, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. సిద్ధారమయ్య, డీకే శికుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications