ఎస్బీఐ తప్ప అన్ని బ్యాంకులూ ప్రైవేటీకరించాల్సిందేనన్న పనగరియా.. నీరవ్ దివాళా కేసులో పీఎన్బీ
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో గత కొన్నేళ్లుగా వరుసగా కుంభకోణాలు, మొండి బాకీలు (ఎన్పీఏలు) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న డిమాండ్ రోజు రోజుకూ ఊపందుకుంటున్నది. ప్రస్తుతం ఈ డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్న పలువురు ఆర్థిక నిపుణులు వినిపిస్తున్నారు. ఈ జాబితాలో నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా చేరారు. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఉద్ఘాటించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణతోనే మొండి బకాయిల నివారణ అన్న పనగరియా
వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పోటీపడే అన్ని రాజకీయ పార్టీలు తమతమ ఎన్నికల ప్రణాళికల్లో (మ్యానిఫెస్టోల్లో) ఈ ప్రతిపాదనను పొందుపర్చాలని ఆయన సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కుంభకోణాలు, మొండి బకాయిలు యథేచ్ఛగా పెరిగిపోతుండటమే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న డిమాండ్ ఊపందుకోవడానికి ప్రధాన కారణమని ప్రస్తుతం కొలంబియా యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నఅరవింద్ పనగరియా స్పష్టం చేశారు.
పార్టీలు మ్యానిఫెస్టోలో చేర్చాలని పనగరియా సూచన
‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను మినహాయించి దేశంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఉన్నదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నా. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నించే రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రణాళికల్లో ఈ ప్రతిపాదనను పొందుపర్చి తీరాలి' అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనగరియా పేర్కొన్నారు.
ప్రాధాన్య రంగాల్లో రుణాల మంజూరుకు ప్రైవేట్ బ్యాంకులే బెస్ట్
ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా డిపాజిట్లను కలిగి ఉన్నా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ విలువ నానాటికీ దిగజారుతున్నదని, ఉత్పాదకతను, సామర్ధ్యాన్ని పెంపొందించి ఈ బ్యాంకులను మళ్లీ గాడిలో పెట్టాలంటే వాటిపై ప్రభుత్వం పెత్తనాన్ని వదులుకోవాల్సిందేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. ప్రభుత్వం తన సామాజిక లక్ష్యాలను సాధించాలంటే కనీసం రెండు డజన్ల బ్యాంకులైనా ప్రభుత్వ రంగంలో ఉండాలని కొంత మంది చేస్తున్న వాదనలో అర్ధం లేదని, ఇది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదేనని పనగరియా విమర్శించారు. ప్రాధాన్యతా రంగాల రుణ అవసరాలను తీర్చడంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులే చక్కగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.
న్యాయ నిపుణుల నియామకానికి పీఎన్బీ కసరత్తు
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆధ్వర్యంలోని కంపెనీల్లో ఒకటైన ఫైర్స్టార్ డైమండ్ సంస్థపై అమెరికాలో జరుగుతున్న దివాలా కేసు విచారణలో పాలుపంచుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) యోచిస్తున్నది. పీఎన్బీలో జరిగిన రూ.13,600 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. నీరవ్ నుంచి బకాయిలను వసూలు చేసేందుకు ఫైర్స్టార్ డైమండ్పై దివాలా కేసు విచారణలో పాల్గొనడం సహా అన్ని అవకాశాలను పీఎన్బీ పరిశీలిస్తున్నదని, ఈ విషయంలో ముందడుగు వేసేందుకు వేసేందుకు వీలుగా న్యాయ నిపుణులను నియమించుకునేందుకు పీఎన్బీ కసరత్తు చేస్తున్నదని అభిజ్ఞ వర్గాలు చెప్పాయి. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు పీఎన్బీ నిరాకరించింది.
నీరవ్ ఆస్తులు విక్రయించకుండా నేషనల్ లా ట్రిబ్యునల్ ఆదేశం
ఫైర్స్టార్ డైమండ్ కంపెనీ దివాలా పిటిషన్పై అమెరికాలో విచారణను నిలిపివేయించేందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ప్రయత్నిస్తున్నది. పీఎన్బీ కుంభకోణంపై వివిధ సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో ఫైర్స్టార్ దివాలా పిటిషన్పై విచారణను నిలిపివేయించేందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రయత్నిస్తున్నదని, ఇందుకు గల న్యాయపరమైన అవకాశాలను ఆ శాఖ పరిశీలిస్తున్నదని ఉన్నతాధికారులు తెలిపారు. పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల సంస్థలు, ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్) కంపెనీలు సహా 60కి పైగా సంస్థలు, పలువురు వ్యక్తులకు చెందిన ఆస్తులను విక్రయించకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇప్పటికే నిషేధాన్ని విధించిన నేపథ్యంలో ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.