2018లో బడ్జెట్: ఆదాయం పన్నుఎత్తివేత దిశగా కేంద్రం అడుగులు?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత ఆదాయం పన్ను రద్దు విషయమై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మొదలు అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ వరకు పలువురు ఈ ప్రతిపాదనను తెర మీదికి తెచ్చారు. దేశంలో అందరికీ ఒకే విధమైన పన్ను ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా లాంటి వారు సూచిస్తున్నారు. అర్థక్రాంతి ఆలోచన మేరకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేశారన్న ప్రచారం ఉన్నది. ఈ నేపథ్యంలో అదే అర్థక్రాంతి సంస్థ చేసిన వ్యక్తిగత ఆదాయం పన్ను ప్రతిపాదనను కూడా మోదీ అమలు చేస్తారని చాలా మంది భావిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విప్లవాత్మక ప్రతిపాదనపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న 2018 - 19 బడ్జెట్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.
దాదాపు 50 ఏండ్ల నుంచి అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టానికి మార్పులు, చేర్పులు చేసి దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఐదు నెలల్లో తన నివేదికను సమర్పించనున్నది. ఆదాయం పన్ను రద్దుకు అనుకూలంగా ప్రస్తుతం ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ఏళ్ల తరబడి పన్నుల పరిధి, ప్రత్యేకించి ఆదాయం పన్ను పరిధి పెరుగడం లేదు.

గత కొన్ని సంవత్సరాల్లో ఆదాయం పన్ను వసూళ్లు స్థూల
దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు రెండు శాతమేనన్న గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 120 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్ లాంటి పెద్ద దేశంలో ఆదాయం పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రాబడి చాలా స్వల్పమనే చెప్పాలి. వాస్తవానికి దేశంలో నిజాయితీగా ఆదాయం పన్ను చెల్లించేవారు మధ్య తరగతి వేతన జీవులే. ఒకవైపు దేశంలోని పేదలు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకపోతే.. మరోవైపు సంపన్నులేమో పన్నులను ఎగ్గొట్టేందుకు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు.

వేతన జీవులపైనే ఐటీ భారం
దీంతో వ్యక్తిగత ఆదాయం పన్నును రద్దు చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా, దాని వలన దేశ మొత్తం జనాభాలో కేవలం రెండు శాతం మందిపై మాత్రమే ప్రభావం పడుతుందని, దేశంలో ప్రతి పౌరుడిపై ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలు లాంటి నిర్ణయాలతో పోలిస్తే వ్యక్తిగత ఆదాయం పన్నును రద్దు చేయడం పెద్ద ఇబ్బందికరమైన విషయమేమీ కాదని జైట్లీ గతేడాది బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టం చేశారు.

ఆర్థిక వ్యవస్థ ప్రగతికి చేయూతనిస్తుందన్న అంచనాలు
వ్యక్తిగత ఆదాయం పన్నును రద్దు చేయడం వలన ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టమేమీ ఉండదని, దీని వలన ఎక్కువ సొమ్ము ప్రజల చేతుల్లోకి వెళ్లి డిమాండ్ పెరుగుదలకు, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పన్నును రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి మరికొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయని, ప్రస్తుతం ఆదాయం పన్ను విభాగంలో పనిచేస్తున్న భారీ అధికార యంత్రాంగం జీఎస్టీ లాంటి ఇతర పన్నులతో పాటు నల్లధనాన్ని గుర్తించడంపై మరింతగా దృష్టి సారించేందుకు వీలవుతుందని, అలాగే ఉద్యోగుల వేతనాలను తగ్గించడం, మరింత మంది ఉద్యోగులను చేర్చుకునేలా సంస్థలను ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలను సృష్టించేందుకు కూడా ఇది దోహదపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు.

బ్యాంకింగ్ డిపాజిట్లు పెరిగే చాన్స్
ఆదాయం పన్ను రద్దు వలన బ్యాంకింగ్ రంగానికి కూడా ఎంతో లాభం చేకూరుతుందని, ప్రజలు నల్లధనాన్ని కూడబెట్టేందుకు, దానిని దాచుకునేందుకు మార్గాలను అన్వేషించకుండా తమ ఆదాయంలో మరింత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారని, దీంతో బ్యాంకు డిపాజిట్లు, రుణ వితరణ సామర్ధ్యం పెరుగుతాయన్న వాదన కూడా ఉన్నది. అర్థక్రాంతి సూచిస్తున్నట్లుగా ప్రభుత్వం ఆదాయం పన్నును రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ లావాదేవీలపై నామమాత్రపు పన్నును సైతం ప్రవేశపెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆదాయం పన్ను రద్దు నిర్ణయం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న ఫలం లాంటిదే. అంతేకాకుండా ఈ ఏడాది పలు రాష్ర్టాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాది లోక్సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద ప్రజాకర్షక నిర్ణయం కూడా అవుతుంది.












Click it and Unblock the Notifications