తప్పుడు పత్రాలతో శఠగోపం: రూ.824 కోట్లకు ‘రుణాల’ టోకరా.. ఆ పై మారిషస్ కు పరారీ?
చెన్నై: పీఎన్బీ మోసం తరహాలో జరిగిన మోసం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 14 బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు పొందేందుకు రూ.824 కోట్ల మేరకు రుణాలు పొందారు. చెన్నై నగర వ్యాపారి భూపేశ్ కుమార్ జైన్. కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేజీపీఎల్) డైరెక్టర్ భూపేశ్ కుమార్ జైన్. 2008 నుంచి 10 ఏళ్లపాటు తప్పుడు పత్రాలు సమర్పిస్తూ రుణాలు పొందారని తేలింది.
భూపేశ్ కుమార్ జైన్ తాను తీసుకున్న రుణాలు చెల్లించకుండా బాకీ పెట్టారు. ఆయన వాటిని ఏమాత్రం కట్టకపోవడంతో బ్యాంకులు మొండి బాకీగా ప్రకటించేశాయి. దీంతో రాత్రికి రాత్రే దుకాణాలు మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితులు మారిషస్కు పారిపోయి ఉంటారని బ్యాంకు భావిస్తోంది.
10 ఏళ్లకు పైగా రుణాలు పొందుతున్న కనిష్క్ గోల్డ్
నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీల జోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో బూటకపు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ)లతో రూ.13,450 కోట్ల మేరకు రుణాలు పొంది మోసం చేశారు. 10 ఏళ్లకు పైగా అలాగే కనిష్క్ గోల్డ్ డైరెక్టర్ భూపేశ్ కుమార్ జైన్ కూడా తప్పుడు పత్రాలు, స్టేట్మెంట్లతో రుణాలు పొందారు.
మొత్తం 14 బ్యాంకులకు భూపేశ్ కుమార్ టోకరా
భూపేశ్ కుమార్ జైన్కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి వరుసలో నిలిచింది. ఎస్బీఐ రూ.240 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.128 కోటలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.46 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.49 కోట్లు, సిండికేట్ బ్యాంక్ రూ.54 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ. 53 కోట్లు, యూకో బ్యాంకు రూ.45 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.22 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ రూ.23 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.32 కోట్లు, తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ రూ.27 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.27 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.27 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.32 కోట్ల రుణం మంజూరు చేశాయి.
ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిటింగ్లో తప్పుడు పత్రాల నిర్ధారణ
గత జనవరిలో దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో అసలు కథ అంతా బయటపడింది. ఆడిటర్లతో కుమ్మక్కై భూపేశ్ కుమార్ జైన్, ఆయన భార్య నీతా జైన్ తప్పుడు పత్రాలు తయారుచేసి రుణాలు పొందినట్లు ఎస్బీఐ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిటింగ్లో తేలిన తర్వాతే సీబీఐకి ఫిర్యాదు చేసింది.
కనిష్క్ గోల్డ్ డైరెక్టర్లు, ఆడిటర్లపై ఎస్బీఐ ఇలా ఫిర్యాదు
బ్యాంకుల నుంచి పొందిన రుణాలను కనిష్క్ గోల్డ్ సంస్థ డైరెక్టర్లు దారి మళ్లించారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో చెన్నైలోని ఎస్బీఐ మిడ్ కార్పొరేట్ రీజినల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ జీడీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది విశ్వాస ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రుణాలను మొండి బకాయిగా నిర్ధారించామని అన్నారు. కేజీపీఎల్, దాని డైరెక్టర్లు భూపేశ్ కుమార్ జైన్, నీతా జైన్, ఆడిటర్లు తేజ్ రాజ్ అచ్చా, అజయ్ కుమార్ జైన్, సుమిత్ ఖేదియాతోపాటు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఎస్బీఐ పేర్కొన్నది. గమ్మత్తేమిటంటే రూ.824 కోట్ల రుణాల కోసం భూపేశ్ కుమార్ జైన్ బ్యాంకులకు సెక్యూరిటీగా పెట్టిన చిరాస్తుల విలువ కేవలం రూ.158.65 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ చిరాస్తుల్లో ఒక ప్లాంట్, కొన్నియంత్రాలు ఉన్నాయని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం పేర్కొన్నది.
భార్య నీతా జైన్ తో కలిసి పరారీలో భూపేశ్ కుమార్ జైన్
2017 సెప్టెంబర్లో కనిష్క్ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్ కుమార్ జైన్ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన భూపేష్ అప్పటినుంచి భార్యతో సహా పరారీలో ఉన్నాడు. కాగా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్ జువెలరీ తన షాపులను విస్తరించింది.
రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ అమలుకు చర్యలు తీసుకోవాలని స్కోప్
ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణ గ్రహీతలు ఎగవేతలకు పాల్పడకుండా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని స్కోప్ చైర్మన్ వేద్ ప్రకాశ్ తెలిపారు. రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలు అమలు చేయాలని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘కొన్నిసార్లు ఒక వ్యక్తి, ఒక గ్రూపులోని ప్రజలు మోసాలు చేయకుండా నిలువరించడం చాలా కష్టసాధ్యంగా మారింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మోసాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది' వేద్ ప్రకాశ్ చెప్పారు.
ఎంఎంటీసీ, ఎస్టీసీ విలీనంపై సమాధానం దాటవేత ఇలా
కొంత మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలను నివారించడానికి స్వతంత్ర డైరెక్టర్ల బాధ్యతలు గణనీయ స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కూడా అయిన వేద్ ప్రకాశ్ మాట్లాడుతూ ఎంఎంటీసీ, ఎస్టీసీ మధ్య విలీనం విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. రెండు సంస్థలు తమ వ్యయాన్ని తగ్గించుకుని సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయని తెలిపారు. ‘ఎంఎంటీసీ, ఎస్టీసీ మధ్య విలీనం ప్రక్రియ సరైన దిశలోనే పయనిస్తుందని భావించొచ్చు' అని ఎంఎంటీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్ చెప్పారు.
భారీ పరిశ్రమలకు రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిధుల కొరత
జాతీయకరణ చేసిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదు దశాబ్దాలకు పైగా భారీ పరిశ్రమలపైనే ద్రుష్టిని కేంద్రీకరించాయి. చిన్న సన్నకారు రైతులు, చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యం చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు ఇతోధికంగా రుణాలిచ్చిన 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజం - ఇన్ఫోసిస్ చైర్మన్.. విశిష్ట ఆధార్ గుర్తింపు సంస్థ ఆర్కిటెక్ నందన్ నిలేకని బ్యాంకుల భవితవ్యంపై నోరు విప్పారు. పన్ను చెల్లింపు దారుల ప్రయోజనాల రీత్యా ప్రైవేటీకరించాలని సెలవిచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బ్యాంకుల జాతీయ కరణ లక్ష్యం నెరవేరలేదన్న నిలేకని
వాస్తవంగా బ్యాంకుల జాతీయకరణకు నేపథ్యం సాధారణ ప్రజలకు రుణ పరపతి కల్పించడమే లక్ష్యమని, కానీ ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. కనుక పన్ను చెల్లింపు దారుల ప్రయోజనాల రీత్యా వాటిని ప్రైవేటీకరించాలని నందన్ నిలేకని సూత్రీకరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 70 శాతం పెట్టుబడులు ప్రభుత్వ పరిధిలో ఉంచాలని సూచించారు. యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు 2016 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు లక్ష నుంచి 17.20 కోట్లకు చేరుకున్నాయని, వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రతి నెలకు రూ.100 కోట్లకు చేరుతుందని తెలిపారు.