EPFO EDLI Scheme: కేవలం 20 రోజుల్లోనే ఫ్రీగా రూ.7 లక్షల బీమా..
ప్రైవేట్, కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. అందులో 'ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ' (ఈపీఎఫ్ఓ) అందించే పీఎఫ్ (PF) సౌకర్యం అత్యంత కీలకమైనది. అయితే, పీఎఫ్ చందాదారులైన ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ఓ ఒక అద్భుతమైన ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోందనే విషయం చాలామందికి తెలియదు. అదే 'ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్' (EDLI) పథకం. ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే, వారి కుటుంబానికి ఆర్థిక కొండంత అండగా నిలిచే ఈ పథకం వివరాలు, దాని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
EDLI స్కీమ్ అంటే ఏంటి? పీఎఫ్ తో దీనికి ఉన్న సంబంధం ఏంటి?
ఈడీఎల్ఐ (EDLI) అనేది ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ వర్తించే ఒక ఉచిత గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ (EPF) ఖాతా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికీ ఈ బీమా రక్షణ స్వయంచాలకంగా (ఆటోమేటిక్గా) వర్తిస్తుంది. దీనికోసం ఉద్యోగులు విడిగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ కాలంలో సదరు పీఎఫ్ చందాదారుడు ఆకస్మికంగా మరణిస్తే, వారి కుటుంబానికి లేదా నామినీకి ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 7 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.

ఉద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది?
సాధారణంగా ఏదైనా జీవిత బీమా పొందాలంటే ఉద్యోగులు తమ జేబులోంచి ప్రతి నెలా లేదా ఏడాదికి ఒకసారి 'ప్రీమియం’ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈడీఎల్ఐ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. దీనికోసం ఉద్యోగుల జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్ చేయరు. ఉద్యోగులకు పూర్తిగా ఉచితంగా లభించే బీమా ఇది.
యజమానులే (కంపెనీలు/యాజమాన్యాలు) తమ ఉద్యోగుల వేతనంలో 0.5% చొప్పున ప్రీమియం మొత్తాన్ని ప్రతి నెలా ఈపీఎఫ్ఓకు చెల్లిస్తారు. నేరుగా పనిచేసేవారే కాకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యాలదే.
బీమా డబ్బులు ఎంత వస్తాయి? ఎలా లెక్కిస్తారు?
ఈ పథకం కింద అర్హులైన నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు కనీసం రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉద్యోగి చివరి 12 నెలల సగటు పీఎఫ్ బ్యాలెన్స్ (ఉద్యోగి, యజమాని సహకారం, వడ్డీతో కలిపి) వారి వేతనం ఆధారంగా లెక్కిస్తారు.
ప్రత్యామ్నాయ లెక్కింపు విధానం..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, గరిష్ట సగటు నెలవారీ వేతనం రూ. 15,000 పై 35 రెట్లు లెక్కగట్టి, దానికి సగటు పీఎఫ్ బ్యాలెన్స్లో 50% మొత్తాన్ని జోడిస్తారు (ఇది రూ. 1.75 లక్షలకు మించకూడదు).
ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 7 లక్షల పూర్తి బీమా ప్రయోజనం కుటుంబానికి దక్కాలంటే, ఉద్యోగులు తమ ఈపీఎఫ్ సహకారాన్ని ఎలాంటి బ్రేకులు లేకుండా క్రమం తప్పకుండా కొనసాగించడం ఎంతో ముఖ్యం.
ఎవరికి వర్తిస్తుంది? ఎలా క్లెయిమ్ చేయాలి?
ఫ్యాక్టరీలు లేదా వివిధ సంస్థలలో పనిచేస్తూ ఈపీఎఫ్ చందాదారులుగా ఉన్న ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. అయితే, అస్సాం లోని తేయాకు తోటల కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించదు.
ఒకవేళ పీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మరణిస్తే, వారి నామినీ లేదా లీగల్ హెయిర్స్ (చట్టబద్ధమైన వారసులు) ఈ బీమా సొమ్ము కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయంలో క్లెయిమ్ ఫారమ్లను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 20 రోజులలోపు క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి చేసి, నామినీ ఖాతాకు సత్వర ఆర్థిక సాయాన్ని ఈపీఎఫ్ఓ అందజేస్తుంది.
యాజమాన్యాలకు హెచ్చరిక
కంపెనీలు ప్రతి నెల ముగిసిన 15 రోజులలోపు బ్యాంక్ డ్రాఫ్ట్, చెక్, నగదు లేదా ఆన్లైన్ బదిలీ ద్వారా ఈడీఎల్ఐ ప్రీమియం మొత్తాన్ని తప్పనిసరిగా జమ చేయాలి. ఒకవేళ ఈ సహకారాన్ని సకాలంలో చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమైతే, సదరు బకాయిలపై నెలకు 1% చొప్పున నష్టపరిహారం (పెనాల్టీ) వసూలు చేస్తారు. అయితే, కంపెనీల మార్పు, విలీనం లేదా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వంటి ప్రత్యేక సందర్భాలు ఉంటే.. కేంద్ర బోర్డు ఆ నష్టపరిహారాలను 100% వరకు తగ్గించే లేదా పూర్తిగా మాఫీ చేసే వెసులుబాటు కూడా ఉంది.
కాబట్టి, పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి తమకు లభిస్తున్న ఈ రూ. 7 లక్షల ఉచిత బీమా రక్షణ (EDLI) గురించి అవగాహన కలిగి ఉండటం, తమ పీఎఫ్ ఖాతాకు నామినీని అప్డేట్ చేసుకోవడం ఎంతైనా అవసరం.














Click it and Unblock the Notifications