అగ్రరాజ్యంలో నిర్మలమ్మ కీలక ప్రకటన. అప్పులు క్లియర్.. రైతుల కోసం ఏకంగా
ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం, అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే.. భారత్ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో ఎక్కడా రాజీ పడకుండానే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను ముందస్తుగానే సాధించి సత్తా చాటింది. ఆర్థిక లోటును నిర్దేశిత పరిమితిలోకి తీసుకురావడమే కాకుండా, దేశ క్రెడిట్ రేటింగ్ను అంతర్జాతీయంగా మరింత పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమెరికాలోని షికాగోలో నిర్వహించిన భారతీయ ప్రతినిధుల సదస్సులో మాట్లాడిన ఆమె, భారత ఆర్థిక విధానాలు, సంస్కరణల వెనుక ఉన్న విజయాన్ని వివరించారు.
గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పెట్టుకున్న 'ఫిస్కల్ డిఫిసిట్' లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. మార్చి 31, 2026 నాటికి భారత ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతంగా నమోదైంది. రూపాయిల్లో చెప్పాలంటే ఇది రూ. 15.19 ట్రిలియన్లు. ఫిబ్రవరిలో అంచనా వేసిన సవరించిన అంచనాల్లో ఇది 97.5 శాతానికి సమానం. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారని, దానివల్లే ప్రపంచంలో భారత్ పట్ల నమ్మకం, క్రెడిట్ రేటింగ్ రోజురోజుకూ పెరుగుతున్నాయని కొనియాడారు.

ప్రపంచం అప్పుల్లో.. భారత్ భద్రంగా!
ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిన దేశాల అప్పులు వారి జీడీపీలో ఏకంగా 200 శాతానికి పైగా పెరిగిపోయాయి. కానీ భారత్ మాత్రం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. 2030 నాటికి దేశ అప్పుల శాతాన్ని (డేట్-టు-జీడీపీ) 50 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు తగ్గిపోకుండా చూస్తూనే, పేదల సంక్షేమ పథకాలకు ఎక్కడా కోత విధించకుండా ఈ సాధన సాధించడం విశేషమని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా ధరల మంటలొచ్చినా మన దేశ వృద్ధి రేటు 7 శాతానికి తగ్గకుండా స్థిరంగా సాగుతోందని అన్నారు.
రైతులకు భారం పడకుండా రూ.2,700 సబ్సిడీ!
ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలను మంత్రి వివరించారు. కరోనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక యూరియా బస్తా ధర రూ. 300 నుంచి ఒక్కసారిగా రూ. 3,000 కు పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ భారాన్ని రైతులపై వేయకుండా, ప్రతీ బస్తాపై ప్రభుత్వమే రూ. 2,700 సబ్సిడీ భరించి సరసమైన ధరలకే అందించామని చెప్పారు. రాబోయే పంట కాలానికి కూడా సరిపడా నిల్వలను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. అలాగే, సముద్ర మార్గాల్లో యుద్ధ వాతావరణం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు వెనక్కి తగ్గినా, ప్రభుత్వమే నేరుగా సహాయం అందించి దిగుమతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసిందని అన్నారు.














Click it and Unblock the Notifications