తడాఖా చూపుతున్న ఎల్ నినో: భారత్ లో పొడిగాలులు: రుతుపవనాలు తిరోగమనం
దేశంలో వర్షాల కాలం క్రమంగా ముగింపు దశకు చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవన వర్షాలు ఇప్పుడు తిరోగమన దిశగా అడుగులు వేస్తోన్నాయి. వాయువ్య, పశ్చిమ భారత్ నుంచి ఈ నెల 20వ తేదీ తర్వాత రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రుతుపవనాలకు బదులుగా ఆయా ప్రాంతాల్లోకి పొడి గాలులు ప్రవేశించనున్నట్లు ని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు.
సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం పశ్చిమ రాజస్థాన్ సరిహద్దుల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా అక్కడి వాతావరణంలో ఇలాంటి మార్పులే స్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత వాయువ్య భారత్ అంతటా కూడా వేడి, పొడి గాలులు వీస్తాయని, అవి వాతావరణంలోని తేమను క్రమంగా హరిస్తాయని ఐఎండీ చెబుతోంది. ఈ ప్రక్రియ.. వర్షాలకు ముగింపు పలకుతుంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఒకేసారి ఏర్పడే అవకాశాలు లేవు. వాయువ్య, పశ్చిమ భారత్ లో పొడి గాలులు ప్రవేశించిన అనంతరం క్రమంగా అవి దేశం అంతటా విస్తరించవచ్చు. వ్యవసాయానికి అత్యంత కీలకమైన ఈ రుతుపవనాల నిష్క్రమణ సమయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ పొడి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వేడి తీవ్రత పెరగొచ్చు. మరికొన్ని చోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదని ఐఎండీ అంచనా వేస్తోంది.
వాయువ్య రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారుతున్నప్పటికీ.. మధ్య, తూర్పు ప్రాంతాలలో మాత్రం వర్షాలు మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడనున్న అల్పపీడన వ్యవస్థ కారణంగా కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ శాతం మెరుగుపడొచ్చు. ఇది రుతుపవనాల నిష్క్రమణను తాత్కాలికంగా అడ్డుకోవడమే కాకుండా ఓ మోస్తరు వర్షాలకు కారణం కానుంది.
ఈ భిన్న వాతావరణ పరిస్థితులు దేశంలో ఒకేసారి సంభవించనున్నాయి. అటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ల్లో ఎండలు పెరిగి, పూర్తి పొడి వాతావరణం నెలకొంటుంది. మరోవైపు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ.. సెప్టెంబర్ 30 వరకు కొనసాగే వీలుందని భారత వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది.
ఈ ఏడాది తిరోగమనం దశలవారీగా జరగనుండటంతో వాతావరణ నిపుణులు దీనిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే పొడి గాలుల తీవ్రత, సముద్రంలో కొనసాగే అల్పపీడనాల మధ్య దాదాపు 10 నుంచి 12 రోజుల తేడా ఉండొచ్చని ఐఎండీ పేర్కొంది. ఈ వాతావరణం బలహీనపడిన తర్వాతే భారత ఉపఖండంలో పూర్తిస్థాయిలో రుతుపవనాల ఉపసంహరణ ముగిసినట్టవుతుంది.














Click it and Unblock the Notifications
