గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో: విస్తుపోయే వాస్తవాలు
భూగోళం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత వేగంగా దెబ్బతింటోంది. మానవ తప్పిదాల వల్ల ఉత్పన్నమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తోన్నాయి. దీని దెబ్బకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో.. గతంలో కంటే మరింత బలంగా రూపాంతరం చెందుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.
ఈ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువులు, ఊహించని భారీ వరదలు, అతివృష్టి వంటి విపరీత పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సైన్స్' అనే జర్నల్లో దీనికి సంబంధించిన ఓ రీసెర్చ్ డాక్యుమెంట్లను ప్రచురించింది. పారిశ్రామిక విప్లవానికి పూర్వపు రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం దాదాపు 36 శాతం బలపడిందని తేలింది. 40 ఏళ్ల కాలంలో దీని తీవ్రతలో 16 శాతం మేర పెరుగడం ఆందోళనకరమని పేర్కొంది.

మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన జూలియా కోల్ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం.. ఎల్ నినోపై 900 సంవత్సరాల నాటి వాతావరణ చరిత్రను పరిశీలించింది. లోతుగా అధ్యయనం చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చోటు చేసుకుంటూ వచ్చిన మార్పులను ఈ బృందం విశ్లేషించింది. బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడటం వల్ల పెరిగిన కాలుష్య ఉద్గారాలకు, ఎల్ నినో తీవ్రత పెరగడానికి మధ్య సంబంధం ఉందని గుర్తించింది.
పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్ నినోగా పిలుస్తారు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం దారుణంగా దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరవులు ఏర్పడి పంటలు ఎండిపోతే, మరికొన్ని ప్రాంతాల్లో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తుతాయి. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తాయి.
ఇది వాతావరణంలో చోటు చేసుకునే సహజ మార్పు కాదని, మానవుల తీరు వల్లే సంభవించిందని నిర్ధారించిందీ టీమ్. పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దానిని ఎల్ నినోగా గుర్తిస్తారు. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల రెండు డిగ్రీల సెల్సియస్ దాటితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణిస్తారు. కొలంబియా యూనివర్శిటీ ట్రాకర్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రత ఏకంగా 2.7 డిగ్రీల సెల్సియస్కు పెరిగిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తీవ్ర ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవరాశులు అంతరించిపోవడం, పగడపు దిబ్బలు వేగంగా క్షీణించడం వంటి భారీ పర్యావరణ నష్టాలు వాటిల్లుతాయి. వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడం వల్లే ఆహార కొరత ఏర్పడవచ్చు. ఈ విపత్కర పరిస్థితుల నుండి భూమిని రక్షించుకోవడానికి కర్బన ఉద్గారాలను వెంటనే నియంత్రించడం, పర్యావరణ అనుకూల పునరుత్పాదక ఇంధన విధానాలను అమలు చేయడం అత్యవసరమని సైన్స్ జర్నల్ పేర్కొంది.
సముద్ర ఉష్ణోగ్రతల రికార్డులు 75 ఏళ్లకు సంబంధించినవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎల్ నినోలో వస్తున్న మార్పులను దీర్ఘకాలికంగా విశ్లేషించడం గతంలో సాధ్యం కాలేదు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొందీ టీమ్. పసిఫిక్ మహాసముద్రంలోని ప్రముఖ గాలాపగోస్ దీవుల్లో లభించిన పగడపు శిలాజాలను విశ్లేషించడం ద్వారా గత 900 ఏళ్ల నాటి వాతావరణ పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసింది.
క్రీస్తు శకం 1,100 నుండి లభ్యమైన సుమారు 29 పగడపు శకలాలను సేకరించారు. వాటిల్లో ఉండే కాల్షియం, స్ట్రాంటియం మూలకాల నిష్పత్తి, అలాగే ఆక్సిజన్ ఐసోటోప్ లను విశ్లేషించారు. దీని ద్వారా నాటి సముద్రపు నీటి ఉష్ణోగ్రతలకు సంబంధించిన కచ్చితమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనలో గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగే కొద్దీ ఎల్ నినో తీవ్రత కూడా అదే స్థాయిలో భారీగా పెరుగుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు స్పష్టమైన ఆధారాలతో నిరూపించారు శాస్త్రవేత్తలు.













Click it and Unblock the Notifications