దేశ యువతకు నిర్మలమ్మ పిలుపు: రిస్క్ తీసుకుంటేనే..
"రిస్క్ లేనిదే లైఫ్ లో దొరికేది రస్క్ మాత్రమే" అనే చందంగా.. నేటి తరం యువత వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకు ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవు పలికారు. దేశ భవిష్యత్తును మార్చగల అద్భుతమైన శక్తి నేటి యువత సొంతమని, ఎలాంటి భయాలు, మొహమాటాలు లేకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ యువతకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన 'వైఫై ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్'లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
నేటి తరం యువతకు మునుపటి కంటే ఎంతో మెరుగైన వనరులు, సమాచారం అందుబాటులో ఉన్నాయని.. ఈ అనుకూలతలను వాడుకుని సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందంటే దానికి మన దేశ పౌరులు, యువ పారిశ్రామికవేత్తల శ్రమే కారణమని ఆమె కొనియాడారు.

లక్షల ఉద్యోగాల సృష్టి.. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా!
భారతదేశంలో స్టార్టప్ విప్లవం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఆర్థిక మంత్రి కొన్ని కీలక గణాంకాలను పంచుకున్నారు. దేశంలో డీపీఐఐటీ (DPIIT) గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2.4 లక్షలు దాటిందని, వీటి ద్వారా ఏకంగా 23 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆమె వెల్లడించారు.
ఈ ఘనతతో ప్రపంచంలోనే స్టార్టప్లకు మూడవ అతిపెద్ద కేంద్రంగా (ఇకోసిస్టమ్) భారత్ అవతరించిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఆరో వంతు (one-sixth) వాటాను భారతదేశమే అందించబోతోందని, మన దగ్గర ఉన్న అపారమైన యువశక్తిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఈ వాటాను నాల్గవ వంతుకు (one-fourth) సైతం తీసుకెళ్లవచ్చని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
డిజిటల్ విప్లవంతో కొత్త అవకాశాలు
మన దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధించిన ప్రగతిని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం యూపీఐ (UPI) ద్వారానే ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, ఇది నూతన వ్యాపారాలకు సరికొత్త మార్గాలను సుగమం చేస్తోందని అన్నారు. ఇంతటి బలమైన సాంకేతిక పునాదిపై యువత తమ సొంత వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకోవాలని సూచించారు.
కేవలం మార్కెట్ వాల్యూ కాదు.. నమ్మకం ముఖ్యం!
యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మంత్రి ఒక విలువైన సలహా ఇచ్చారు. వ్యాపారంలో ఓటమి ఎదురవుతుందేమోననే అనవసర భయాలను వీడాలన్నారు. చాలామంది కేవలం కంపెనీ మార్కెట్ విలువను (Valuation) పెంచుకోవడంపైనే దృష్టి పెడతారని, అలా కాకుండా సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక విలువలను (Value Creation) సృష్టించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కేవలం లాభాల కోసమే కాకుండా పరిశోధన, అభివృద్ధి (R&D) పై పెట్టుబడులు పెడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తూ దశాబ్దాల పాటు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే కంపెనీలు దేశానికి ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications