FSSAI: ఫుడ్ ప్యాకెట్లపై ఇకపై రెడ్ మార్క్. కొత్త రూల్స్, త్వరలోనే కొత్త చట్టం!
మీరు రోజూ తినే చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ప్యాకెట్లపై త్వరలోనే ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలు కనిపిస్తాయి. మనదేశంలో తినుబండారాల నాణ్యతను పర్యవేక్షించే 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'- FSSAI ప్యాకేజ్డ్ ఫుడ్పై సరికొత్త బాంబు పేల్చింది. పరిమితికి మించిన చెక్కర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాల ప్యాకెట్ల ముందు భాగంలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా రెడ్ కలర్ వార్నింగ్ లేబుళ్లను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. వినియోగదారులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ప్రజారోగ్యాన్ని కాపాడే నిబంధనలను రూపొందించడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆలస్యం చేయడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన ఆహార భద్రతా సంస్థ, ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ (ICMR-NIN) నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఆరు పేజీల అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. వినియోగదారులకు ఏది మంచిదో, ఏది చెడో క్షణాల్లో తెలపడానికి ప్యాకెట్ ముందే స్పష్టమైన ఎరుపు రంగు లేబుల్ వేయాలని నిర్ణయించింది.

షాకింగ్ రెడ్ షేప్ లేబుల్స్
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం, ప్యాకెట్ ముందు భాగంలో ఎరుపు రంగు ఆరుభుజాల ఆకారంలో వార్నింగ్ గుర్తును ముద్రించాలి. ఇవి సులువుగా అందరి కంటికి కనిపించేలా ఉండాలి. వెనుక ముద్రించే సాధారణ పోషకాల వివరాల కంటే ఈ లేబుల్లోని అక్షరాలు పెద్దగా ఉండాలి. ఒకవేళ కొవ్వు ఎక్కువగా ఉంటే "హై ఫ్యాట్", చెక్కర ఎక్కువగా ఉంటే "హై షుగర్", ఉప్పు ఎక్కువగా ఉంటే "హై సాల్ట్" అని రాయాలి. ఒకవేళ రెండూ ఎక్కువగా ఉంటే "హై ఫ్యాట్, హై షుగర్" అని, అలాగే కూల్ డ్రింక్స్పై "హైలీ స్వీటెండ్ బెవరేజ్" అని పెద్దగా ముద్రించాల్సి ఉంటుంది.
వీటికి మాత్రం మినహాయింపు!
ప్రతిపాదించిన నిబంధనల నుంచి కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ మినహాయింపు ఇచ్చింది. ఒకే ఒక్క పదార్థంతో రూపొందే సహజ ఉత్పత్తులకు ఈ ఎరుపు రంగు వార్నింగ్ లేబుళ్లు అవసరం లేదని తెలిపింది. పాలు, నెయ్యి, వంట నూనెలు, స్వచ్ఛమైన పంచదార, బెల్లం, తేనె వంటి నాచురల్ పదార్థాలకు ఈ వార్నింగ్ సింబల్స్ నుంచి ఊరట కలిగించారు.
రెండు విడతల్లో అమలు ప్లాన్
ఈ సరికొత్త రూల్స్ను దేశవ్యాప్తంగా రెండు దశల్లో అమల్లోకి తీసుకురావాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. మొదటి దశలో రెండింటి కంటే ఎక్కువ హానికర పోషకాలుగా పరిగణించే ఉప్పు, పంచదార, కొవ్వు) ఉన్న పదార్థాలతో పాటు, ఎక్కువ తీపి ఉండే కూల్ డ్రింక్స్ ప్యాకెట్లపై వార్నింగ్ గుర్తును తప్పనిసరి చేస్తారు. ఆ తర్వాత రెండో దశలో, కేవలం ఒక్క పోషకం పరిమితికి మించి ఉన్న ప్యాకేజ్డ్ ఆహారాలకు కూడా ఈ రెడ్ కలర్ వార్నింగ్ నిబంధనను విస్తరిస్తారు.














Click it and Unblock the Notifications