పడిపోతున్న పంచదార ధరలు! డీలర్లకు షాక్, అమల్లోకి కొత్త రూల్స్
దేశవ్యాప్తంగా పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ సామాన్యుడికి స్వీట్ షాక్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం బిగ్ ప్లాన్ వేసింది. నిత్యావసరాలలో ఒకటైన పంచదార ధరలు ఆకాశాన్ని తాకకుండా నియంత్రించేందుకు, కృత్రిమ అభావ పరిస్థితులను సృష్టించే దాపరికపు ముఠాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చక్కెర వ్యాపారులు, హోల్సేల్ డీలర్లు తమ వద్ద ఉంచుకునే సరుకు పరిమితిని ఏకంగా సగానికి తగ్గించేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర డీలర్లు గరిష్టంగా 2,000 క్వింటాళ్లకు మించి స్టాక్ ఉంచుకోవడానికి వీల్లేదు. ఇప్పటివరకు ఉన్న 4,000 క్వింటాళ్ల పరిమితిని సగానికి తగ్గించారు. అంతేకాకుండా, వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకును 30 రోజులకు మించి తమ గోడౌన్లలో ఉంచుకోకూడదనే కఠిన నిబంధన విధించారు. అయితే, కోల్కతా, దాని పరిసర ప్రాంతాలు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చక్కెర పంపిణీ చేసే ప్రధాన హబ్గా ఉండటంతో, ఆ ప్రాంతానికి మాత్రం మినహాయింపు ఇస్తూ పాత 4,000 క్వింటాళ్ల పరిమితినే కొనసాగించారు.

బ్లాక్ మార్కెటింగ్పై ఆకస్మిక దాడి!
ఇటీవల మిల్లులు, పెద్ద డీలర్ల గోడౌన్లలో జరిగిన భౌతిక తనిఖీల్లో అక్రమ నిల్వలు, లెక్కల్లో చూపని సరుకు, కదలికల్లో అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. జులై నెలలో కిలో రూ.48.18గా ఉన్న పంచదార రిటైల్ ధర, ఆగస్టు నాటికి ఒక్కసారిగా 15.6 శాతం పెరిగి రూ.55.70కి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అతివృష్టి, చెరకు పంటకు సోకిన చీడపీడల వల్ల ఈ ఏడాది పంచదార ఉత్పత్తి అంచనా 343 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 306 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఈ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి లాభపడాలని చూస్తుండటంతో సర్కార్ ఈ సర్జికల్ స్ట్రైక్ చేసింది.
పండుగ సీజన్లో ధరలకు బ్రేక్!
దేశీయంగా చక్కెర సరఫరాను పెంచేందుకు ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్నుల రా-షుగర్ ఉచిత దిగుమతులకు కేంద్రం అనుమతించింది. అక్టోబర్ 15 నుంచే చెరకు గానుగ ప్రారంభించాలని మిల్లులను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వరుస కఠిన చర్యల వల్ల ఇప్పటికే హోల్సేల్ మార్కెట్లో ఎక్స్-మిల్ ధరలు 20 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. రాబోయే దసరా, దీపావళి పండుగల సమయంలో మార్కెట్లో చక్కెర కొరత రాకుండా, సామాన్యులకు అందుబాటు ధరల్లోనే లభించేలా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు.














Click it and Unblock the Notifications