Gold, వెండిపై కేంద్రం ఉక్కుపాదం! ఇక ధరలు తగ్గుతాయా?
భారతదేశంలో పసిడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, అదే పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలోకి బంగారు దిగుమతులు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య) దేశీయ బంగారు దిగుమతులు ఏకంగా 28.73 శాతం పెరిగి 69 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ విలువ 53.52 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం, దేశీయంగా ఆభరణాల తయారీకి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,51,500 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

వాణిజ్య లోటుపై 'పసిడి' దెబ్బ..
బంగారు దిగుమతులు పెరగడం వల్ల దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరిగింది. దీనివల్ల దేశ వాణిజ్య లోటు (Trade Deficit) గతేడాది ఉన్న 261.80 బిలియన్ డాలర్ల నుండి 310.60 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. మన దేశానికి అవసరమైన బంగారంలో దాదాపు 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి అవుతుండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. కేవలం ఫిబ్రవరి నెలలోనే స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు 719 శాతం పెరగడం గమనార్హం.
వెండి జోరు.. ప్రభుత్వం ఆంక్షలు..
కేవలం బంగారమే కాదు, వెండి దిగుమతులు కూడా ఈ 11 నెలల కాలంలో 142.87 శాతం పెరిగి 11.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో వెండి వినియోగం పెరగడమే ఇందుకు కారణం. ఈ అనూహ్య దిగుమతుల వల్ల కరెంట్ ఖాతా లోటు (CAD) కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, దిగుమతులను నిరుత్సాహపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినంతో తయారయ్యే అన్ని రకాల వస్తువుల దిగుమతులపై కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications