UPI MDR Charges అంటే ఏంటి? వినియోగదారులపై పడే భారమెంత?
స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు..10 రూపాయిల టీ నుంచి వేల రూపాయల కొనుగోళ్ల దాకా అంతా యూపీఐ ద్వారానే సాగిపోతోంది. జేబులో రూపాయి నోటు లేకపోయినా డిజిటల్ చెల్లింపులతో నెట్టుకొస్తున్న సామాన్యుడికి త్వరలోనే చిన్నపాటి షాక్ తగిలేలా ఉంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మళ్లీ సర్వీస్ ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఇప్పటికే బిల్లు పాస్ చేసింది. ఆరు సంవత్సరాల క్రితం తొలగించిన 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' నిబంధనను మళ్లీ అమలుల్లోకి తెచ్చేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
అసలు ఏమిటీ ఎండీఆర్ ఛార్జీ?
మన బ్యాంక్ ఖాతా నుంచి షాపు యజమాని ఖాతాలోకి డబ్బులు డిజిటల్ మార్గంలో సురక్షితంగా వెళ్లడానికి బ్యాంకులు, పేమెంట్ యాప్స్ వెనుక పెద్ద వ్యవస్థనే నడుపుతాయి. ఈ సేవలు అందించినందుకు గానూ సదరు వ్యాపారుల నుంచి బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వసూలు చేసే రుసుమునే 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) అంటారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసి 'జీరో ఎండీఆర్' విధానాన్ని తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ బందీని తొలగిస్తూ చట్టంలో సవరణలు చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో అడుగులు వేశారు.

ఎప్పటి నుంచి... ఎవరిపై ఈ భారం పడుతుంది?
చట్ట సవరణ జరిగినంత మాత్రాన రేపటి నుంచే ఛార్జీలు పడిపోవని, దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మార్పుల వల్ల చిన్న వ్యాపారులకు, రోజువారీ చిన్న చిన్న లావాదేవీలు చేసే వారికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే పెద్ద లావాదేవీలు, అలాగే భారీ టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలపై మాత్రమే ఈ ఎండీఆర్ వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. రూ.2,000 లోపు జరిపే సాధారణ పేమెంట్లకు మినహాయింపు ఉండవచ్చని సమాచారం.
ఎండీఆర్కు, ప్లాట్ఫామ్ ఫీజుకు తేడా ఏంటి?
చాలామంది ఎండీఆర్ను, యాప్స్ వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును ఒకటిగానే భావిస్తారు. కానీ ఇవి రెండూ వేర్వేరు. ఎండీఆర్ అనేది బ్యాంకులు, ఎన్పీసీఐ లాంటి నెట్వర్క్ వ్యవస్థలకు వెళ్లే రుసుము. ఇప్పటివరకు ఉచిత విధానం ఉన్నందున ఈ ఖర్చును ప్రభుత్వమే బ్యాంకులకు భరిస్తూ వచ్చింది. ఇక ప్లాట్ఫామ్ ఫీజు అనేది పేమెంట్ యాప్స్ తమ నిర్వహణ ఖర్చుల కోసం కస్టమర్ల నుంచి నేరుగా తీసుకునేది.
సామాన్య కస్టమర్ జేబుకు కత్తెర పడుతుందా?
సాధారణంగా ఎండీఆర్ అనేది వ్యాపారులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుసుము. కస్టమర్లు తమ బిల్లుపై నేరుగా ఈ ఫీజును కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే వ్యాపారులు తమ లాభాల్లో కోత పడకుండా ఉండటానికి, ఈ ఛార్జీల భారాన్ని పరోక్షంగా వస్తువుల ధరలు పెంచి కస్టమర్లపైనే మోపే అవకాశం ఉంది. ప్రభుత్వం భవిష్యత్తులో ఖరారు చేసే ఎండీఆర్ శాతం, నిబంధనలను బట్టి సామాన్యుడిపై ఎంత మేరకు భారం పడుతుందనేది ఆధారపడి ఉంటుంది.




Click it and Unblock the Notifications