రూ. 2,000 యూపీఐ, రూపే పేమెంట్లపై అర్ధరాత్రి గెజిట్ విడుదల చేసిన కేంద్రం
దేశంలో డిజిటల్ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 2,000 వరకు జరిపే యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై తన వైఖరిని తేటతెల్లం చేసింది. రూ. 2,000, అంతకు మించిన మొత్తంపై అదనపు ఛార్జీలను విధించే విషయంపై తీసుకున్న నిర్ణయం కావడం వల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మేరకు అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది.
బ్యాంకులు లేదా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి.. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు రూ. 2,000 రూపాయలు, అంతకుమించిన మొత్తంతో జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు చార్జీలు విధించకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ కింద లభించిన అధికారాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్ ద్వారా రోజువారీ కొనుగోళ్లు నిర్వహించే సామాన్య ప్రజలు, చిన్న తరహా వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగినట్టయింది.

ప్రస్తుతం యూపీఐ, రూపే ద్వారా జరిగే ఈ డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, పేమెంట్ కంపెనీలే భరిస్తూ వస్తోన్నాయి. ఇకపై వీటిని యూజర్లకు బదలాయిస్తారంటూ కొన్ని రోజులుగా వార్తలు వెలుడుతున్న విషయం తెలిసిందే. కేంద్రం సైతం వీటిపై లీకులు ఇచ్చింది ఇదివరకు. దీంతో డిజిటల్ పేమెంట్ చెల్లింపుదారుల్లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. తాజా గెజిట్ విడుదలతో.. వాటన్నింటికీ తెరదించింది కేంద్రం.
దేశంలో డిజిటల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 241.6 బిలియన్ల యూపీఐ చెల్లింపులు నమోదయ్యాయి. వాటి మొత్తం విలువ దాదాపు రూ. 314.2 లక్షల కోట్లు. అలాగే ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగదారుల సంఖ్య 55 కోట్లకు చేరుకుంది. ఈ స్థాయిలో చెల్లింపులు పెరగడంతో నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం, భద్రతను బలోపేతం చేయడం, సైబర్ మోసాలను అరికట్టడం వంటి పనుల కోసం నిధుల అవసరం ఏర్పడింది.
ఈ క్రమంలో.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సైతం యూపీఐ కోసం ప్రత్యేకంగా ఓ నిధుల విధానాన్ని రూపొందించాలని కేంద్రానికి సూచించింది. దీంతో ఈ అదనపు మొత్తాన్ని యూజర్ల నుంచి వసూలు చేయాలని గతంలో కేంద్రం ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. భవిష్యత్తులో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం ఉందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
వినియోగదారులు ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ లేదా పేమెంట్ యాప్లకు వ్యాపారస్తులు చెల్లించే సర్వీస్ ఛార్జీని ఎండీఆర్ అంటారు. ప్రస్తుతం యూపీఐ, రూపే డెబిట్ కార్డులపై ఈ వసూళ్లు.. జీరో. ఒకవేళ భవిష్యత్తులో రూ. 2,000 దాటిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించినా, ఆ భారం వినియోగదారులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తాన్ని వ్యాపారస్తుల నుంచే వసూలు చేసే అవకాశం ఉందని, లావాదేవీల విలువ ఆధారంగా 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు చార్జీలు ఉండవచ్చని భావిస్తోన్నారు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి తుది నిర్ణయం వెలువడలేదు.













Click it and Unblock the Notifications
