మన రూపాయికి బలం పెరిగింది! దశాబ్దంలోనే కఠిన నిర్ణయం
అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నా.. భారత రూపాయి మాత్రం పట్టుదలను ప్రదర్శిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న ఉక్కుపాదం వంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తుండటంతో, డాలర్ ధాటికి వెనక్కి తగ్గకుండా రూపాయి లాభాల బాట పట్టింది
వరుస ఒడిదుడుకుల తర్వాత భారత రూపాయి కోలుకుంటోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు లాభపడి 93 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. గత వారంలో ఆర్బీఐ జారీ చేసిన కఠిన ఆదేశాల ప్రభావంతో రూపాయి దాదాపు 2 శాతం మేర బలపడటం గమనార్హం. ముఖ్యంగా విదేశీ మార్కెట్లలో రూపాయి విలువపై జరుగుతున్న అనవసర ఊహాగానాలను (Speculation) కట్టడి చేయడంలో ఆర్బీఐ వ్యూహం పక్కాగా పనిచేసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆర్బీఐ 'మాస్టర్ ప్లాన్'.. ఏప్రిల్ 10 నాటికి మరింత బలోపేతం?
దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐ విదేశీ ఎన్డీఎఫ్ (NDF) మార్కెట్పై నియంత్రణ సాధించింది. బ్యాంకులు తమ డాలర్ నిల్వలను తగ్గించుకోవాలని సూచించడంతో రూపాయికి డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 10 గడువులోపు బ్యాంకులు తమ స్థానాలను సర్దుబాటు చేసుకుంటే, రూపాయి విలువ 91.50 నుంచి 92.00 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో నేడు ప్రారంభమయ్యే ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) సమీక్షపై అందరి కళ్లు నెలకొన్నాయి. వడ్డీ రేట్లపై ఏప్రిల్ 8న వెలువడే నిర్ణయం రూపాయి భవిష్యత్తును నిర్ణయించనుంది.
చమురు సెగ.. ట్రంప్ హెచ్చరికల మధ్య ఉత్కంఠ!
రూపాయి లాభాల్లో ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా 'బ్రెంట్ క్రూడ్' ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ షిప్పింగ్ మార్గాన్ని తెరవాలని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ విధించడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఇరాన్ తలొగ్గకపోతే కీలక మౌలిక సదుపాయాలపై దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు బ్యారెల్ ధర 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరిగితే అది రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications