లాభాల బాటపట్టిన స్టాక్ మార్కెట్లు, ఐటీ షేర్ల జోరు, ఏడురోజుల కనిష్టానికి పసిడి ధర!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమై, చివరివరకూ అదే ధోరణిలో సాగాయి. ఐటీ కంపెనీల షేర్ల జోరుతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పీఎన్బీలో చోటుచేసుకున్న భారీ కుంభకోణంతో గత మూడు సెషన్ల నుంచి పడిపోతూ వచ్చిన మార్కెట్లు బుధవారం కొంత నిలదొక్కుక్కున్నాయి.
గత మూడురోజులు వరుసగా నష్టాలతో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141.27 పాయింట్లు లాభపడి 33,844.86 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 37.05 పాయింట్లు లాభపడి 10,397.45 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక షేర్ల విషయానికొస్తే.. ఓఎన్జీసీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభపడగా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ బ్యాంక్, హిందాల్కో సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి. డాలర్తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయి ప్రస్తుతం రూ.64.79కు చేరింది.
నిఫ్టీ 50 స్టాక్స్లో టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ 3 శాతం పైగా లాభపడ్డాయి. వీటితో పాటు ఐటీసీ, ఓఎన్జీసీ కూడా టాప్ గెయినర్లుగా నిలిచాయి. అటు మెటల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. సన్ఫార్మా దాదాపు 6 శాతం మేర పడిపోయి, నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ లూజర్గా ఉంది.
మరోవైపు బంగారం ధరలు బుధవారం ఏడు రోజుల కనిష్టానికి పడిపోయాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, స్థానిక వర్తకుల నుంచి డిమాండ్ తగ్డడంతో వరుసగా రెండో రోజూ పసిడి ధర దిగొచ్చింది. మంగళవారం రూ.100 తగ్గిన బంగారం ధర.. బుధవారం ఏకంగా రూ.250 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరింది.
మూడేళ్ల కనిష్టం నుంచి డాలర్ విలువ తిరిగి పుంజుకోవడంతోపాటు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పసిడి ఢర భారీగా తగ్గినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. రూ.140 తగ్గడంతో బుధవారం కేజీ వెండి ధర రూ.39,300కు చేరింది.