వడ్డీ రేట్లపై సంచలన నిర్ణయం! ఫెడ్ చరిత్రలోనే అతిపెద్ద అభిప్రాయ భేదం
గ్లోబల్ మార్కెట్లను శాసించే అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' (ఫెడ్) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి నిర్ణయం వెనుక మామూలు రచ్చ జరగలేదు. బయటికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. లోపల మాత్రం అధికారుల మధ్య తీవ్రమైన వాగ్వాదం నడిచింది. ఏకంగా 2016 తర్వాత ఒకే వేదికపై ఇంతపెద్ద స్థాయిలో అభిప్రాయ భేదాలు బయటపడటం ఆర్థిక నిపుణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తగ్గేదేలే అంటున్న 'ముగ్గురు' అధికారులు!
కీలక వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 3.5 శాతం నుంచి 3.75 శాతం పరిధిలోనే కొనసాగించాలని కమిటీలోని మెజారిటీ సభ్యులు ఓటేశారు. మొత్తం 12 మంది సభ్యుల్లో తొమ్మిది మంది 'యథాతథ స్థితి'కే మొగ్గు చూపగా.. ముగ్గురు అధికారులు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచాల్సిందేనని పట్టుబట్టారు. క్లీవ్ల్యాండ్ ఫెడ్ ప్రెసిడెంట్ బెత్ హామాక్, మిన్నియాపోలిస్ ఫెడ్ అధిపతి నీల్ కాష్కారీ, డల్లాస్ ఫెడ్ ప్రెసిడెంట్ లోరీ లోగాన్ ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుబట్టారు.

ద్రవ్యోల్బణమే ప్రధాన శత్రువు
ఈ ముగ్గురు అధికారుల మాట ఒకటే 'ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు'. నిత్యావసరాల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పొడుస్తున్నాయని, లక్ష్యంగా పెట్టుకున్న 2 శాతానికి ద్రవ్యోల్బణం చేరాలంటే వడ్డీ రేట్ల పెంపు తప్పదని వారు గట్టిగా వాదించారు. గత కొంతకాలంగా ఆర్థిక వ్యవస్థపై కఠిన వైఖరినే అవలంబిస్తున్న ఈ అధికారులు, మార్కెట్కు ముందే సంకేతాలిచ్చేందుకు సిద్ధమయ్యారు.
కుటుంబంలో చిన్నపాటి గొడవ లాంటిదే!
సమావేశం అనంతరం ఫెడ్ చైర్మన్ కేవిన్ వార్ష్ విలేకరులతో మాట్లాడుతూ.. లోపల జరిగిన చర్చ తీవ్రతను కాస్త తేలికపరిచే ప్రయత్నం చేశారు. "ఇది మా కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ లాంటిదే. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కానీ, అందరి చివరి లక్ష్యం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడమే" అని ఆయన వ్యాఖ్యానించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన అధికారులు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో వారే క్లారిటీ ఇస్తారని చెప్పారు.
మార్కెట్ల చూపు తదుపరి భేటీపైనే!
వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గకపోగా, మరిన్ని పెంపులు ఉంటాయా అనే అనుమానాలు ఇప్పుడు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కొందరు సభ్యులు భావిస్తుంటే.. తొందరపడి రేట్లు పెంచకూడదని మెజారిటీ అధికారులు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో వెలువడే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉద్యోగ అవకాశాల సమాచారం ఆధారంగానే సెప్టెంబర్లో జరిగే తదుపరి భేటీలో ఫెడ్ ఎలాంటి అడుగు వేస్తుందో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications