వేలూరు సీఎంసీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్; షాకింగ్ వీడియో వైరల్; ఏడుగురు విద్యార్థులు సస్పెండ్!!
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు లో ప్రతిష్టాత్మకమైన క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల తొమ్మిదో తారీకు జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియోలతో వెలుగులోకి రావడంతో మెడికల్ కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు కళాశాల అధికారులు వెల్లడించారు.
వేలూరు మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ .. ఏడుగురు సస్పెన్షన్
జూనియర్ విద్యార్థులను అర్థనగ్నంగా తిప్పడం, లైంగిక చర్యలను అనుకరించడం ద్వారా వారిని వేధింపులకు గురి చేశారని వచ్చిన ఆరోపణలతో ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఈ ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విచారణ పూర్తయ్యే వరకు విద్యార్థులను సస్పెండ్ చేసినట్టుగా కళాశాల అధికారులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
కళాశాలలో జరిగిన ర్యాగింగ్ గురించి, ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అక్కడే చదువుతున్న ఓ విద్యార్థిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అబ్బాయిల హాస్టల్లో ఫ్రెషర్లు ఎదుర్కొంటున్న శారీరక మరియు లైంగిక వేధింపుల గురించి, కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ గురించి కమ్యూనిటీ ప్లాట్ఫారమ్ రెడ్డిట్లో కూడా పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసిన వారిని షాక్ కు గురి చేసింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో తీవ్రమైన ర్యాగింగ్ వీడియో రుజువు. ఈ సంస్థలో మాత్రమే కాకుండా వివిధ డిగ్రీల్లో ఇతర వైద్య కళాశాలల్లో విస్తృతంగా ఉన్న ర్యాగింగ్ సమస్యలను సమాజం తెలుసుకోవడం కోసం ఇక్కడ జరుగుతున్న చర్యలను దయచేసి భాగస్వామ్యం చేయండి అందరికీ తెలిసేలా చెయ్యండి అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు సదరు విద్యార్థి.
జూనియర్లపై ర్యాగింగ్ పేరుతో శారీరక, మానసిక వేధింపులు
ఇక వైరల్ అవుతున్న వీడియోలో మెన్స్ హాస్టల్ క్యాంపస్ లో జూనియర్లను బట్టలూడదీసి కేవలం అండర్ వేర్ లతో క్యాట్ వాక్ చేయించారు. అంతేకాదు పైపులతో నీళ్లు చల్లుతూ, కర్రలు, బెల్టులతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. అక్కడే ఉన్న బురదగుంటలో పడుకోవాలని, సెక్స్ చేస్తున్నట్టు బురదగుంటలో అనుకరణ చూపించాలని, ఒకరినొకరు రుద్దుకోవాలని ఆజ్ఞాపించి శాడిజం చూపించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో కళాశాల యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఏడుగురు సస్పెండ్ .. విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామన్న కాలేజ్ డైరెక్టర్
క్రిస్టియన్ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ మాథ్యూస్ క్యాంపస్లో విలేకరులతో మాట్లాడుతూ తమకు ఈ సంఘటనకు సంబంధించి అనామక లేఖ వచ్చిందని, దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు అనంతరం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక విచారణ పూర్తయ్యే వరకు ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నామని డైరెక్టర్ వెల్లడించారు.