తమిళనాడులో జూన్ 14 వరకు లాక్డౌన్ పొడగింపు... సడలింపులు ఇవే...
తమిళనాడు ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించింది. జూన్ 14 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చినా.. వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేసేందుకు లాక్డౌన్ను పొడగించింది. గతంలో ఉన్న లాక్ డౌన్ సడలింపులే ఇప్పుడు కూడా వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని 11 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో సడలింపులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
కోయంబత్తూరు,నీలిగిరిస్,తిరుప్పూర్,ఈరోడ్,సాలెం,కరూర్,నమక్కల్,తంజోర్,తిరువూర్,నాగపట్టిణం,మయిలదుత్తరై పట్టణాల్లో సడలింపులు ఉండవని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కిరాణ షాపులు,హార్డ్ వేర్ షాపులు,ఆటోమొబైల్ షాపులు,ఇతరత్రా షాపులకు అనుమతినిచ్చింది. చేపలు,మాంసం విక్రయాలకు సంబంధించి హోల్ సేస్ వ్యాపారులకు మాత్రమే అనుమతినిచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్, సెలూన్ షాపులకు అనుమతినివ్వలేదు.
ప్రజలు తమకు సమీప షాపుల్లోనే కూరగాయలు,నిత్యావసరాలు కొనుగోలు చేయాలని... అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. వ్యక్తిగత వాహనాలను వాడటం తగ్గించాలని చెప్పింది.అపార్ట్మెంట్లు,కమర్షియల్ కాంప్లెక్సుల్లో పనిచేసే హౌస్ కీపింగ్ స్టాఫ్కు అనుమతినిచ్చింది. అయితే వారికి ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. పంబ్లర్లు,ఎలక్ట్రిషియన్లు,కార్పెంటర్లకు కూడా పనులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తాయని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఒక రోజులో కేవలం 50 టోకెన్లకే పరిమితం చేశారు.
Recommended Video
దక్షిణాదిలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కేరళలో జూన్ 9 వరకు,తెలంగాణలో జూన్ 10 వరకు,కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్డౌన్ అమలులో ఉండనుంది.