సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టిన నగరి ఎమ్మెల్యే రోజా .. ఎందుకంటే
Recommended Video
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఈ మధ్య చేదు అనుభవం ఎదురవుతుంది. మొన్న సొంత పార్టీ కార్యకర్తలతో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆర్థర్ కు చేదు అనుభవం ఎదురు కాగా, నిన్నటికి నిన్న నగిరి ఎమ్మెల్యే రోజా పై వైసిపి కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీంతో రోజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదైంది.

వైసీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ కార్యకర్తల నుండే సెగ
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తల నుండే వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తోంది. మొన్నటికి మొన్న కర్నూలులోని జూపాడు మండలం బన్నూరులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్థర్ ను వైసిపి కార్యకర్తలు తమకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని నిలదీయగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కార్యకర్తల కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

నగరి ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం .. దాడికి యత్నం
ఇక ఇదే తరహాలో ఎమ్మెల్యే రోజా కి కూడా సొంత పార్టీ కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె తనపై దాడికి యత్నించిన వైసిపి కార్యకర్తల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం లో పర్యటించిన రోజాకు కె బిఆర్ పురంలో వైసిపి కార్యకర్తల నుండి చేదు అనుభవం ఎదురైంది.

భూమి పూజకు వెళ్ళిన రోజాను అడ్డుకుని దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తలు
ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నించారు వైసిపి కార్యకర్తలు. కె బిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజ కి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు . పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తమ పార్టీకి చెందిన నేతలు కొందరు దాడి చేయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఎమ్మెల్యే రోజా
అంతేకాదు తనపై దాడికి ప్రయత్నించిన వారిని ఉపేక్షించబోమని చెప్పిన రోజా వారిపై కేసులు నమోదు చేశారు. రోజా పై దాడి యత్నం ఘటన వైసీపీలో చినికి చినికి గాలివానగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టే వరకు వెళ్లింది. రోజా ఫిర్యాదుతో పుత్తూరు పోలీస్ స్టేషన్లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి,హరీష్, సంపత్ తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విక్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పుత్తూరు పోలీసులు. మొత్తానికి వైసిపి ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గాల్లో సొంత పార్టీ కార్యకర్తల నుండి విముఖత వ్యక్తం కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications