తిరుపతిలో కత్తిపోట్లు.. యువకుడి పరుగులు.. కాపాడిన బస్ డ్రైవర్
తిరుపతి : తిరుపతిలో సినిమా సీన్ కనిపించింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు ప్రత్యర్థులు. తిరుపతి రూరల్ మండలంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే బాధితుడు ప్రత్యర్థుల నుంచి తప్పించుకుని అటుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
తిరుచానూరు యోగిమల్లవరానికి చెందిన మదన్ కుమార్ అనే యువకుడు టూవీలర్ పై వెళుతూ.. తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లె చెక్పోస్టు దగ్గర ఆగాడు.
అదే సమయంలో కొందరు వ్యక్తులు అటుగా వచ్చి కత్తులతో దాడిచేశారు. విచక్షణరహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అయినప్పటికీ అలాగే పరుగులు పెడుతూ అటుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఎక్కేశాడు.

ప్రాణాలు కాపాడుకోవటానికి మదన్ కుమార్ ఆర్టీసీ బస్ ఎక్కిన కూడా దుండగులు వదిలిపెట్టలేదు. అలాగే బస్సును వెంబడించడంతో బస్ డ్రైవర్ వేగం పెంచాడు. దాంతో దుండగుల బారి నుంచి అతడు తప్పించుకున్నట్లైంది. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ఎంఆర్పల్లె రక్షక్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడికి వైద్యం అందిచడానికి రుయా ఆసుపత్రికి తరలించారు. మదన్ కుమార్ శరీరంపై మొత్తం 9 కత్తిపోట్లు పడ్డట్లు గుర్తించిన వైద్యులు తగిన చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కార్వేటి నగరంలో జరిగిన జంట హత్యల కేసులో మదన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే పాతకక్షలతో ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం. మదన్ కుమార్ పై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications