Pic Talk: తొలుత మానవత్వం..ఆ తరువాతే రాజకీయం: సీపీఐ నారాయణ కాలికి కట్టుకట్టిన వైసీపీ ఎంపీ
తిరుపతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి లోక్సభ సభ్యుడు ఎం గురుమూర్తి వృత్తిరీత్యా వైద్యుడు. ఫిజియోథెరఫిస్ట్. ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చేపట్టిన సమయంలో గురుమూర్తి ఫిజియోథెరఫిస్ట్గా పనిచేశారు. ఆ అభిమానంతోనే వైఎస్ జగన్ ఆయనకు తిరుపతి లోక్సభ టికెట్ ఇచ్చారు. ఉప ఎన్నికలో గెలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిపై రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గురుమూర్తి విజయం సాధించారు.
శాసన మండలి రద్దు బిల్లు కూడా వెనక్కి?: వైఎస్ జగన్ బిగ్ స్కెచ్
సీపీఐ నారాయణ కాలికి కట్టు..
లోక్సభలో అడుగు పెట్టినా.. తన వృత్తిని విస్మరించలేదాయన. రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడట్లేదు. సీపీఎం జాతీయ నేత డాక్టర్ కే నారాయణ గాయపడగా.. ఆయనకు చికిత్స అందించారు. రాయల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి సమీపంలోని రాయల చెరువు పూర్తిగా నిండిపోయిన విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గండి పడే స్థితికి చేరుకుంది. చాలాచోట్ల లీకులు కనిపించాయి. గండి పడుతుందని ఆందోళన చెందారు స్థానికులు.
కాలినడకన తిరిగిన నారాయణ..
అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. ఆ లీకులను అరికట్టారు. ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రితో రాయల చెరువు కట్ట తెగకుండా కాపాడుకోగలిగారు. కాగా- డాక్టర్ నారాయణ సహా సీపీఐకి చెందిన కొందరు నాయకులు రాయల చెరువు, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చారు. రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు వద్ద రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. దీనికోసం సుమారు రెండు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లారు. రాయల చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు.
కాలు బెణికి..
వెనుదిరిగి వచ్చే సమయంలో బురదగా ఉండటం వల్ల నారాయణ జారి కింద పడబోయారు. పక్కనే ఉన్న పార్టీ నాయకులు ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు. ఈ ఘటనతో కుడి కాలు బెణికింది. కాలు కొంతవరకు వాచింది. వాపు రావడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో రాయల చెరువు కట్టను పరిశీలించడానికి ఉపముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
కాలికి కట్టు కట్టిన ఎంపీ..
అక్కడే కూర్చుని ఉన్న నారాయణను వారు పలకరించారు. కాలు బెణికిందనే విషయాన్ని వారికి వివరించారు నారాయణ. దీనితో ఎంపీ డాక్టర్ గురుమూర్తి గాయాన్ని పరిశీలించారు. వృత్తిరీత్యా ఫిజియోథెరఫిస్ట్ కావడంతో అక్కడికక్కడే ఆయన కాలికి కట్టుకట్టారు. నారాయణ కాలిని తన ఒడిలో పెట్టుకుని కట్టు కట్టారు ఎంపీ గురుమూర్తి. అనంతరం చికిత్స కోసం నారాయణను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. తన వాహనంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
Recommended Video
యుద్ధ ప్రాతిపదికన లీకేజీ అరికట్టే పనులు..
కాగా- రాయల చెరువు లీకేజీని అరికట్టే పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఇసుక, సిమెంట్, కంకర కలిపిన మిశ్రమాన్ని నింపిన సంచులను అడ్డుగా పెట్టారు. దీనికోసం జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల రప్పించారు. వందలాదిమంది కూలీలను రంగంలోకి దింపారు. మరమ్మతు పనులను చేపట్టారు. కట్టపై నీటి ఒత్తిడి పడకుండా ఉండటానికి కుప్పం బాదురు వద్ద గండిని వెడల్పు చేశారు. అవుట్ ఫ్లోను పెంచారు. దీనితో చెరువు నీటి మట్టం కొంతమేర తగ్గింది. ఈ పనులన్నింటినీ ఎంపీ గురుమూర్తి పర్యవేక్షించారు.