శ్రీ ఎం ఆశ్రమం.. ఏంటి దీని ప్రత్యేకత?: కాస్సేపట్లో రాష్ట్రపతి సందర్శన: చిత్తూరుకు జగన్ సహా
చిత్తూరు: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. కాస్సేపట్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటోన్న ఆయన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకి రానున్నారు. మదనపల్లె సమీపంలోని శ్రీ ఎం సత్సంగ్ ఫౌండేషన్ను సందర్శిస్తారు. సుమారు అయిదు గంటల పాటు అక్కడే గడపనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లెకు బయలుదేరి వెళ్లనున్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేసిన వైఎస్ జగన్: ప్రైవేటీకరణను అడ్డుకునేలా రెండంచెల మాస్టర్ ప్లాన్
బెంగళూరులో ఏర్పాటు చేసిన ఏరో ఇండియా షో 2021కు సందర్శించడానికి రెండు రోజుల కిందటే రామ్నాథ్ కోవింద్ బెంగళూరుకు చేరుకున్నారు. కర్ణాటక మడికెరి జిల్లాలో కావేరీ నది జన్మస్థానం తలకావేరీని సందర్శించారు. మడికెరిలో జనరల్ తిమ్మయ్య మ్యూజియాన్ని ప్రారంభించారు. కాస్సేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి మదనపల్లెకు చేరుకుంటారు. చిప్పిలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయనకు గవర్నర్, ముఖ్యమంత్రి ఆహ్వానం పలుకుతారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీ ఎం సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమంలో భారత్ యోగ విద్యా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అక్కడి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 38 పడక స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మహేశ్వర్ నాథ్ బాబాజీ దీన్ని స్థాపించారు. మహా యోగి మహావతార్ బాబాజీ శిష్య పరంపరను ఆయన కొనసాగిస్తున్నారు. నాథ్ సంప్రదాయాన్ని అనుసరిస్తోన్న మహేశ్వర్ నాథ్.. 2020లో మదనపల్లె సమీపంలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు.
ఈ ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం మధ్యాహ్నం 3 గంలకు రామ్నాథ్ కోవింద్ సదుంకు బయలుదేరి వెళ్తారు. అక్కడి పీపుల్స్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులను కలుసుకుంటారు. వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఈ సాయంత్రం మళ్లీ బెంగళూరుకు వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రామ్నాథ్ కోవింద్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.