డ్యామేజ్ కంట్రోల్: చావు దెబ్బ తిన్న వేళ.. కుప్పానికి చంద్రబాబు: మండల స్థాయిలో పర్యటన
చిత్తూరు: కుప్పం.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తోన్నారు అక్కడి ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. టీడీపీ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు. ఇప్పటిదాకా వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు.

చెమటోడ్చక తప్పని స్థితి..
మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. చంద్రబాబు ఛరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి. దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ. టీడీపీ అధినేత పోటీ చేసినా సరే.. గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణ కుప్పంలో నెలకొంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

పార్టీ బలహీనపడినట్టే..
గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీనడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా.. గట్టీ పోటీ సైతం ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- ఈ స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.

పార్టీలకు అతీతంగా పాలన..
కుప్పంలో పార్టీ బలహీనపడటానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకటి- జగన్ సర్కార్ పరిపాలన తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న యువతీ యువకులు వలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం అధికంగా..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బ్యానర్లను కట్టారు. పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది కుప్పం నియోజకవర్గంలో.

కొత్త స్థానం తప్పదా?
చంద్రబాబు నాయకత్వంపై తమకు ఉన్న అసహనాన్ని, అసంతృప్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించడం ద్వారా ప్రదర్శించకున్నారనే వాదనలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కబెడితే గానీ టీడీపీ గెలవలేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబును కొత్త అసెంబ్లీ స్థానాన్ని వెదుక్కునేలా చేస్తోన్నాయని చెబుతున్నారు. ఈ సారి కుప్పంలో గెలవడానికి అనుకూల వాతావరణం ఉందని వైఎస్సార్సీపీ నాయకత్వంలో కాన్ఫిడెంట్ రావడానికి కారణాలు ఇవేనని అంటున్నారు.

నాలుగు రోజులు అక్కడే మకాం..
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఆయన మకాం వేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదురైన నేపథ్యంలో- ఆయన నిర్వహంచ తలపెట్టిన ఈ టూర్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. మూడు రోజుల మకాం వేశారు. ఆ తరువాత నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. చంద్రబాబు స్వయంగా వచ్చి మకాం వేసినా సత్ఫలితాలు రాలేదు.
Recommended Video

ఇప్పుడు మళ్లీ
ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కుప్పం పర్యటనను తలపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. 11వ తేదీన ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకుంటారు. 11, 12వ తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. చంద్రబాబు మండల స్థాయిలో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications