చంద్రబాబుకు టెన్షన్ పెడుతున్న కుప్పం- వైసీపీ యువ గళం
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మొన్నీ మధ్యే ఉద్రిక్తతల ముగిసింది. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. పార్టీ నాయకులను కలుసుకున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించడానికి ఉద్దేశించిన జీఓ నంబర్ 1ని తీవ్రంగా తప్పుపట్టారు.
ఉద్రిక్తతల మధ్య..
అప్పట్లో ఆయన రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి, కుప్పంలల్లో విస్తృతంగా పర్యటించారు. జీఓ 1 అమలులో ఉన్న నేపథ్యంలో ఆయన మూడు రోజుల పర్యటన మొత్తం ఉద్రిక్తతల మధ్యే సాగింది. రోడ్ షోలను నిర్వహించిన ప్రతీచోటా పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది- చంద్రబాబు పోలీసుల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ పెద్దలపై చంద్రబాబు సవాళ్లు విసిరారు అప్పట్లో.
చంద్రబాబు పర్యటించిన చోటే..
ఇప్పుడు తాజాగా- చంద్రబాబు ఏఏ మండలాలు, గ్రామల్లో పర్యటించారో.. అవే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు జోరుగా పర్యటనలు సాగిస్తోన్నారు. నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్, శాసన మండలి సభ్యుడు కేఆర్జే భరత్ విస్తృతంగా పర్యటనలు సాగిస్తోన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తోన్నారు.
శాంతిపురంలో..
శాంతిపురం మండలంలోని సొన్నేగౌనిపల్లి, శివరామపురం, తమ్మిగానిపల్లె, ముద్దనపల్లె, నంజంపేట, పెద్దూరు, పోడూరుల్లో ఆయన పర్యటిస్తోన్నారు. సోన్నేగౌనిపల్లిలో స్థానిక నాయకులతో కలిసి ప్రజలను ముఖాముఖిగా కలుసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన బ్రోచర్లను అందించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల వల్ల ఒక్కో కుటుంబానికి అందుతోన్న నిధుల గురించి వివరించారు.
యువతకే ప్రాధాన్యత..
ఈ నెల 27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్న చోటే- కుప్పం ఓటర్లు వైఎస్ఆర్సీపీ స్థానిక యువ నాయకత్వానికి బ్రహ్మరథం పడుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేఆర్జే భరత్ నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పెద్దిరెడ్డి పర్యటన..
రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాలను గెలవాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ కు నిర్దేశించిన నేపథ్యంలో- దానికి తొలి అడుగు కుప్పం నుంచే పడేలా కార్యక్రమాలను స్థానిక నాయకులు రూపొందించుకుంటోన్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన అటవీ-విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి- సంక్రాంతి పండగ తరువాత నియోజకవర్గం పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నందున దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నారు.