వేధించడం సరికాదు.. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి: నాదెండ్ల
అమలాపురం జనసేన ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబును గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. దీనిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, పాలకులు వేధింపు ధోరణులు అవలంబించడం సరికాదని విమర్శించారు. కోనసీమలో రోజుకు 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయని గుర్తుచేశారు.
ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. వైద్య వసతులు కల్పించాలని రాజబాబు డిమాండ్ చేస్తున్నారని నాదెండ్ల వివరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రాజబాబు ఒక్కరే దీక్ష చేపట్టారని, అయినప్పటికీ ఆయనను గృహ నిర్బంధంలో ఉంచి, ఆయన వాహనాన్ని సీజ్ చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.
రాజబాబు చేస్తున్న డిమాండ్ ఎంతో న్యాయబద్ధమైనదని వివరించారు. వెంటనే ఆయనను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని నాదెండ్ల స్పష్టం చేశారు. కోనసీమలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ, కెయిర్న్, గెయిల్ వంటి చమురు సంస్థలు తమ సీఎస్సార్ నిధులతో వెంటనే వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.
Recommended Video
ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. కానీ ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. రికవరీ రేటు కూడా బాగానే ఉంటుంది.. కానీ మరణాలు ఎక్కువ జరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరికొద్దీరోజులు ఆగితే వైరస్ బలహీనపడుతోందని వైద్య నిపుణులు అంటున్నారు.