పవన్ సీఎం అవుతారు.. కానీ కండీషన్స్ అప్లై: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏం చేసినా సంచలనమే.. ఇవాళ ఉదయం ఆయనను కాకినాడలో రత్నకుమార్ అడ్డుకోగా.. సాయంత్రం ఏలూరుకి వచ్చారు. అక్కడ ఆయన తెగ హడావిడి చేశారు. రోడ్డుపక్కన గల దుకాణంలో టీ తాగుతూ అందరిని ప్రజాశాంతి పార్టీ వైపు రావాలంటూ కోరారు. అందరితో నవ్వుకుంటూ మాట్లాడారు. తమ పార్టీని మరింత బలపరచాలని కోరారు.
జనసేనాని పవన్ కల్యాణ్ గురించి కామెంట్స్ చేశారు. ఆయనను తమ్ముడు అని సంభోదించారు. పవన్ కల్యాణ్ తనతో వస్తే సీఎం అవుతారు.. బీజేపీతో ఉంటే సీఎం అవ్వలేరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుందని, ఇక కుటుంబ పాలనను అంతమొందించాలని కేఏ పాల్ అన్నారు. అంతా కలిసి ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని కోరారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ను కలిసి ప్రజాశాంతి పార్టీతో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తానని కేఏ పాల్ చెప్పారు.
కాకినాడలో కేఏ పాల్ కార్లను రత్నకుమర్ తీసుకున్నాడు . పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెబుతున్నాడు. ఇవ్వమని అడిగితే తననే బెదిరిస్తున్నారని ఆరోపించాడు. నిన్న పాల్ కాన్వాయ్లో ఉండే రెండు కార్లను రాత్రి రత్నకుమార్ తన షెడ్లో పెట్టుకున్నాడు. ఇవాళ వాటిని తీసుకునేందుకు వచ్చిన పాల్ డ్రైవర్లకు రత్నకుమార్ అనుచరుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కేఏ పాల్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, వాటిని ఇచ్చిన తరువాతే వాహనాలను తీసుకెళ్లండని రత్నకుమార్ అనుచరులు మొండికేశారు. కేఏ పాల్కు చెందిన బౌన్సర్లు వాహనాలను తీసుకెళ్లేందుకు రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రత్నకుమార్ ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశాడని పాల్ అంటున్నాడు. తన కార్లను ఇక్కడే పార్క్ చేయాలని సూచించాడని చెబుతున్నాడు. ఇవాళ డబ్బులు ఇవ్వాలని చెబుతున్నాడని పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రత్నకుమార్ను గతంలో కేఏపాల్తో కలిసి మత ప్రచార సభల్లో పాల్గొన్నారు. తనకు పాల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఆయన చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆయన ఏలూరులో పర్యటించారు.