నేడే తమిళనాడులో పెద్ద పండగ
నేడు.. స్కంద షష్టి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా శుక్ల పక్షం షష్ఠి తిథి నాడు స్కంద షష్ఠి జరుపుకోవడం ఆనవాయితీ. కుమారస్వామికి అంకితం చేసిన విశేష పర్వదినం ఇది. ఆయనను సుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణ వంటి వివిధ పేర్లతో కొలుస్తారు. తమిళులు జరుపుకొనే పెద్ద పండగల్లో ఇదీ ఒకటి. సుబ్రహ్మణ్యస్వామివారు కొలువైన పళణి, తిరుత్తణి వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు.
శుభ ముహూర్తం, పూజా విధానం..
సంతానం లేని దంపతులకు స్కంద షష్ఠి వ్రతం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. శత్రువులపై విజయం సాధించడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి, జీవితంలోని ఆటంకాలను తొలగించుకోవడానికి కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన శుభ ముహూర్తం, పూజా విధానం, సంతానం కోసం పాటించాల్సిన ఉపాయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్కంద షష్ఠి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి?..
ప్రతి నెలా శుక్ల పక్షం షష్ఠి తిథి నాడు ఈ వ్రతం నిర్వహిస్తారు. ఈసారి వైశాఖ శుక్ల షష్ఠి తిథి ప్రారంభం, ముగింపు సమయాలను దృక్ పంచాంగం స్పష్టం చేసింది. దృక్ పంచాంగం ప్రకారం వైశాఖ శుక్ల షష్ఠి తిథి ఏప్రిల్ 21న తెల్లవారుజామున 1 గంట 19 నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 22న రాత్రి 10 గంటల 49 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా ఏప్రిల్ 22వ తేదీనే స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం.
స్కంద షష్ఠి రోజున..
స్కంద షష్ఠి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం పరిశుభ్రమైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. చేతిలో కొద్దిగా నీళ్లు తీసుకుని, మీ కోరికను మనసులో తలుచుకుంటూ వ్రత సంకల్పం చేసుకోవాలి. ఓ పీఠంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి, దానిపై కార్తికేయుని చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. కుమారస్వామితో పాటు శివపార్వతులను కూడా పూజించడం ఆనవాయితీ.
పూజా విధానం..
పూజ చేసే సమయంలో కార్తికేయునికి పంచామృతం, జలంతో అభిషేకం చేయాలి. చందనం, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. శాస్త్రాల ప్రకారం కుమారస్వామికి నీలిపూలు, నెమలి ఈకలు చాలా ప్రీతిపాత్రమైనవి కాబట్టి, వాటిని పూజలో తప్పనిసరిగా చేర్చాలి. ధూపదీపాలు వెలిగించి, పండ్లు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ సమయంలో "ఓం స్కందాయ నమః" లేదా "ఓం శరవణభవాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి. పూజ ముగింపులో కథను విని, హారతిని ఇవ్వాలి.
చేయకూడనివి..
స్కంద షష్ఠి వ్రతం రోజున మనస్సు, మాట, కర్మలలో శుద్ధిని పాటించడం అత్యవసరం. ఈ రోజున తామస ఆహారాలు (వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం), మాదకద్రవ్యాలను సేవించకూడదు. వ్రతం ఆచరించే రోజున ఎలాంటి వివాదాలు, కోపం, ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు. ఈ రోజున నేలపై నిద్రించడం శ్రేయస్కరం. శక్తి మేరకు నిరుపేదలకు పండ్లు, వస్త్రాలు, ధాన్యం దానం చేయడం మంచిది. ఈ నియమాలను పాటించడం వల్ల వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం.












Click it and Unblock the Notifications