మాచర్లలో 5 గురు బీసీల హత్య.. MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం?
మాచర్లలో 5గురు బీసీలను హత్య చేశారని, ఆ హత్యల వెనక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. పల్నాడులో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జల్లయ్య మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా చెప్పడంలేదని మండిపడ్డారు. జల్లయ్య సొంత గ్రామంలో అంతిమ సంస్కారాలు చేసే అవకాశం కూడా ఇవ్వరా? అంటూ నిలదీశారు.
జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లయ్య ప్రాణాలను కాపాడలేని పోలీసులు అంత్యక్రియలకు వెళుతున్నవారిని అరెస్ట్ చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తరఫున జల్లయ్య కుటుంబానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూ.25 లక్షలు ప్రకటించారు.
ప్రత్యర్థుల దాడిలో మృతిచెందిన జల్లయ్య మృతదేహం పోస్టుమార్టంపై మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు చెప్పకుండా పోస్టుమార్టం చేశారని, తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చే వరకు ఆగాలంటూ చెప్పినా వినిపించుకోకుండా చేశారంటూ మార్చురీ వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, జల్లయ్య బంధువలకు తోపులాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.