జ్యోతి హత్యాచారం మరువకముందే.. మంగళగిరిలో మరో గ్యాంగ్ రేప్.. వైసీపీ సర్కారు కీలక ఆదేశాలు
లైంగిక వేధింపులు, రాసలీల కేసుల్లో పోలీసులు ఒక్కొక్కరుగా పట్టుపడుతున్న గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మంగళగిరిలో వారం రోజుల వ్యవధిలో రెండోసారి మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. చినకాకానిలో జరిగినట్లుగా చెబుతోన్న తాజా ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే మంగళగిరి మండలంలో ఈనెల 11న జ్యోతి అనే యువతిని దుండగులు అత్యాచారంచేసి హత్యచేసిన సంగతి తెలిసిందే.

సర్కారు సీరియస్.. అధికారుల పరుగులు..
మంగళగిరిలో వారం వ్యవధిలో రెండో గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకోవడాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులు వైసీపీ సంబందీకులు కావడం వల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై సీఎం జగన్.. హోం మంత్రి సుచరితకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. హోం మంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.

పోలీసులపైనే ఇన్వెస్టిగేషన్
చినకాకాని గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు రావడంతో వాటిపై డీఎస్పీ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదును పోలీసులు సీక్రెట్ గా ఉంచడం, మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతగానీ ఉన్నతాధికారులకు వెల్లడించకపోవడంతో మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్ సిబ్బందిపై ఉన్నతాధికారులు మండిపడినట్లు తెలిసింది.

జ్యోతి డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం..
మంగళగిరి మండలం నవులూరులో జ్యోతి, శ్రీనివాస్ అనే ప్రేమ జంటపై ఈనెల 11న రాత్రి 9 గంటల ప్రాంతంలో నలుగురు యువకులు దాడిచేశారు. శ్రీనివాస్ ను బీరు సీసాలతో కొట్టి, జ్యోతిని ఈడ్చుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదంతంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసు విచారణలో ఉండానే తాజాగా మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది.

గుంటూరు రేంజ్ లో అదుపుతప్పిన వ్యవస్థ..
శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే అదుపుతప్పి ప్రవర్తిస్తుండటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం గుంటూరు రేంజ్ లో పెరిగిపోవడం కలకలం రేపుతున్నది. మహిళతో అక్రమ సంబంధం వ్యవహారంలో నగరపాలెం సీఐ వెంకట్ రెడ్డిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. దీనికి కొద్దిరోజుల ముందే.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల్ని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఇద్దరు ఎస్సైలు, ఒక కానిస్టేబుల్ సస్పెండయ్యారు. గుంటూరు రేంజ్ లో మెజార్టీ కేసుల్లో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుండటం, అత్యాచారాలు, నేరాలపై నియంత్రణలో సరిగా పనిచేయడంలేదనే ఆరోపణలు పెరిగిపోయిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.












Click it and Unblock the Notifications