తన సభలో తొక్కిసలాటలో ముగ్గురి మృతిపై షాక్లో చంద్రబాబు- ఎక్స్గ్రేషియా: ఎందుకు వెళ్లానంటే
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఆయన నిర్వహించిన సభలో సంభవించిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో ఓ మహిళ మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

వికాస్ నగర్ లో..
మృతులను గోపిశెట్టి రమాదేవి, గౌసియాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరావాల్సి ఉంది. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున..
సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సభకు వచ్చిన ప్రజలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తోందని అన్నారు.

ఎందుకు వెళ్లానంటే..
ఉయ్యూరు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, పేదలకు సేవ చేయడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ముందుకు రావాలనే ఉద్దేశంతోనే తాను ఇందులో పాల్గొన్నానని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమం ముగియడానికి ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. దీన్నొక దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు.

నాణ్యమైన వైద్యం కోసం జగన్ ఆదేశం..
అంతకుముందు- ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి ఫోన్ చేశారు. తక్షణమే ఆసుపత్రికి వెళ్లి- బాధితులను పరామర్శించాలని సూచించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై సమగ్ర నివేదిక అందజేయాలని, ప్రాణనష్టం తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications