చంద్రబాబు సభలో ముగ్గురి మృతిపై జగన్ దిగ్భ్రాంతి: మంత్రి విడదల రజినికి ఫోన్: ఆసుపత్రిలో..!!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో గందరగోళం చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఆయన నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో ఓ మహిళ మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను గోపిశెట్టి రమాదేవి, గౌరియాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరావాల్సి ఉంది.

కందుకూరు ఘటన విస్మరించకముందే..
మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున..
సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చంద్రన్న కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

అదే తరహాలో..
ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..సంక్రాంతి పండగ సమయంలో చంద్రన్న కానుక పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుకగా మహిళలకు చీరెలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది మరణించిన ఉదంతం ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోకముందే మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

జగన్ దిగ్భ్రాంతి..
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి ఫోన్ చేశారు. తక్షణమే ఆసుపత్రికి వెళ్లి- బాధితులను పరామర్శించాలని సూచించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై సమగ్ర నివేదిక అందజేయాలని, ప్రాణనష్టం తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆసుపత్రిలో పరామర్శ..
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి విడదల రజినీ గుంటూరు జనరల్ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

చంద్రబాబుదే బాధ్యత..
మొన్న కందుకూరులో ఎనిమిది మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు మహిళల మరణాలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి విడదల రజిని అన్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం వల్ల మరణాల సంఖ్య తగ్గిందని అన్నారు. బాధితులను సకాలంలో అంబులెన్సుల ద్వారా జీజీహెచ్ కు తరలించారని చెప్పారు. తన సభలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారని ప్రచారం చేసుకోవడానికే చంద్రబాబు ఈ కానుకల పంపిణీ చేపట్టారని ధ్వజమెత్తారు.

వాహనాలు పెట్టి తరలింపు..
ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తెలుగుదేశం పార్టీ ఈ కానుకల పంపిణీకి తరలించిందని, దానికి అనుగుణంగా గ్రౌండ్ లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విడదల రజినీ విమర్శించారు. మధ్యాహ్నం నుంచి వారు గ్రౌండ్ లోనే ఉన్నారని గుర్తు చేశారు. తాము ఇచ్చిన చీరెలతో అందరి జీవితాలు బాగుపడతాయనే భ్రమను కలిగించే ప్రయత్నం చంద్రబాబు చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో 29, కందుకూరులో ఎనిమిది మంది, ఇప్పుడు ముగ్గురి మరణానికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications