Chandrababu: వైశ్యుడినైనందుకే కక్ష సాధింపు: చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి సెగ..లేఖ!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు అలియాస్ గిరి దండెత్తారు. మద్దాలి గిరి త్వరలోపార్టీ ఫిరాయించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని నియమించడం ఆగ్రహానికి కారణమైంది. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గురువారం ఆయన చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖను రాశారు.

12 గంటల్లోనే ఇన్ ఛార్జి నియామకం..
ముఖ్యమంత్రిని కలిసిన 12 గంటల వ్యవధిలోనే తన నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని నియమించడాన్ని మద్దాలి గిరి తప్పుపట్టారు. వల్లభనేని వంశీమోహన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గన్నవరం స్థానానికి గానీ, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ రావుకు చెందిన సత్తెనపల్లి సీటుకు గానీ పార్టీ ఇన్ ఛార్జిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. వారిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులానికి చెందిన నాయకులు కావడం వల్లే ఇన్ ఛార్జిలను నియమించలేదని అన్నారు.

కమ్మ కులంవాడిని కానందుకేనా..
తాను వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాడినైనందుకే అప్పటికప్పుడు ఇన్ ఛార్జిని వేశారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తాను ప్రజల వెంటే ఉన్నానని, తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను, నియోజక వర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన నిర్ణయాన్ని సమర్ధించడం తప్పా అని నిలదీశారు.

షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడం వెనుక ఉన్న కారణాలను కూడా తెలుసుకోకుండా, కనీసం షోకాజు నోటీసులు కూడా ఇవ్వకుండా 12 గంటల వ్యవధిలోనే నియోజకర్గ ఇన్ ఛార్జ్ గా మరొకరిని నియమించడం లో మీ ఆంతర్యం ఏమిటి? అని ఆయన చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారా? అని నిలదీశారు. ఎన్నికల సందర్భంగా టికెట్ కేటాయింపులోనూ ఇదే వైఖరి అవలంభించారని, చివరి నిమిషం వరకూ తనను ఎన్నో సమస్యల గురి చేశారని విమర్శించారు.

మతలబేంటీ?
వల్లభనేని వంశీ రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ స్థానానికి గానీ, కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఖాళీ ఏర్పడిన సత్తెనపల్లి నియోజకవర్గం, బాపట్లలో ఇప్పటికీ పార్టీ ఇన్ ఛార్జీలను నియమించని విషయాన్ని మద్దాలి గిరి ఈ సందర్భంగా చంద్రబాబుకు గుర్తు చేశారు. ఆయా స్థానాల్లో ఇంకా ఇన్ చార్టీ నియామకం చేపట్టక పోవడం, తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న గుంటూరు పశ్చిమ స్థానంపై అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో గల మతలబు ఏమిటని ప్రశ్నించారు.

విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలపై ఏ చర్య తీసుకున్నారు?
సమాజమే దేవాలయంగా అన్న నందమూరి తారకరామారావు గారు భావిస్తే చంద్రబాబు మాత్రం ఒక సామాజిక వర్గానికి లబ్ది కలిగించడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని మద్దాలి గిరి ఆరోపించారు. విశాఖలో టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు అమరావతిని రాజధానిగా వ్యతిరేకించి విశాఖ రాజధానిగా చేయడాన్ని సమర్ధించినప్పుడు వారిపై ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారని ప్రశ్నించారు. తనపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications