14 మంది విదేశీయుల గుర్తింపు: కరోనా పరీక్ష కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దేశంలోనూ, రాష్ట్రంలోనూ విదేశీయుల ద్వారానే కరోనా సోకుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్లో పర్యటించిన ఇండోనేషియా వాసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో విదేశీయులు పర్యటించిన ప్రాంతాలను అధికారులు, పోలీసులు జల్లెడపడుతున్నారు.

కరీంనగర్లో 8 మంది విదేశీయులకు కరోనా
ఇండోనేషియా పర్యాటకుల్లో 8 మందికి కరోనా సోకడం, వారంతా కరీంనగర్లోనే పర్యటించడంతో ప్రస్తుతం నగరంలో అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారు పర్యటించిన ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకి రావొద్దంటూ నగర ప్రజలకు ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

నల్గొండలో 14 మంది విదేశీయుల గుర్తింపు.. గాంధీ ఆస్పత్రికి..
ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న 14 మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. వీరి నుంచి రక్తనమూనాలు పరీక్షించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాతే కరోనా లక్షణాలున్నాయా? లేదా? అనేది తెలుస్తుందని చెప్పారు.

తెలంగాణలో 16కు చేరిన కరోనా కేసులు
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 47 మంది అనుమానితులు చికిత్స తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా సోకుతుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Recommended Video

దేశంలో 206 కరోనా కేసులు,. 5 మరణాలు..
రాష్ట్రంలో ఎక్కడైనా విదేశీయులు కనిపిస్తే సమాచారం అందించాలని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచించారు. దేశంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. దేశంలో కరోనావైరస్ తాజాగా 20 రాష్ట్రాలకు విస్తరించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 206కు చేరాయి. ఇక జైపూర్లో శుక్రవారం ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5కు చేరింది. ఇప్పటి వరకు దేశంలో నలుగురు భారతీయులు, ఒక విదేశీయుడు కరోనాబారినపడి మరణించారు.












Click it and Unblock the Notifications