మరో అల్పపీడనం: హైదరాబాద్లో భారీ వర్షం, ప్రజలకు హెచ్చరికలు, కేటీఆర్ రివ్యూ
హైదరాబాద్: మహా నగరాన్ని వర్షాలు వీడటం లేదు. గత వారం పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైపోయింది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మరోసారి వర్షంలో తడిసిన ముద్దైన హైదరాబాద్
ఇప్పటికే కురిసన వర్షాలకు తోడు మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు నగర ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి మరోసారి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు మరోసారి నీటమునిగాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సుల్తాన్ బజార్, కోఠి, కొత్తపేట, దిల్సుఖ్నగర్ , సరూర్నగర్, చంపాపేట్, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, చర్లపల్లి, మల్కాజ్గిరి, మలక్పేట్, ఏఎస్రావునగర్, కీసర, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ, మల్లాపూర్, నాచారం, బోడుప్పల్, కాప్రా, సైనిక్పురి, పీర్జాదీగూడ, గోల్కొండ, లంగర్హౌస్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, ఉప్పుగూడ, బార్కస్, ఛార్మినార్, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, ఖైరతాబాద్, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

మరో అల్పపీడనంతో.. మరిన్ని వర్షాలు..
ఇది ఇలావుంటే, మంగళవారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడుగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. అతి భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార సూచించారు.

ప్రజలకు హెచ్చరికలు.. కేటీఆర్ రివ్యూ
మంగళవారం కూడా వర్షం భారీగా పడే అవకాశం ఉండటంతో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రాకూడదని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. మరోవైపు వరద సహాయక చర్యలపై పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న పదిరోజులపాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. బాధితులందరికీ సాయం అందాలనేది సీఎం ఆలోచనా విధానమని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందజేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.












Click it and Unblock the Notifications