Telangana Weather: తెలంగాణలో వణికిస్తున్న చలి.. సిర్పూర్ లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
తెలంగాణలో చలి క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండి చలి తీవ్రత పెరిగిపోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.5 డిగ్రీలు నమోదయింది. సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 9.7, నిర్మల్ లో 10.3, మంచిర్యాలలో 10.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 10, మెదక్ జిల్లా టెక్మాల్ లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకుంటుంది. చలి తీవ్రతకు ఆదిలాబాద్ ప్రజలు మరింత వణికిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్లో చలి వణికిస్తోంది. GHMC శివారు ప్రాంతాల్లో చలి పెరిగింది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
చలి పెరుగుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తెల్లవారుజామున పనులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లితే చెవులకు గాలి తగలకుండా రక్షణ తీసుకోవాలని, జర్కిన్ వేసుకోవడం మంచిదని చెబుతున్నారు.