Asaduddin Owaisi: గాడ్సేపై వస్తున్న సినిమాను పీఎం అడ్డుకుంటారా..!
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిబిసి డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా పీఎం అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. "బ్రిటీష్ చట్టాల ఆధారంగా భారతదేశంలో ట్విట్టర్, యూట్యూబ్లో బిబిసి ఇంటర్వ్యూను మోడీ ప్రభుత్వం నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో అంతరిక్షం నుంచి లేదా ఆకాశం నుంచి ఎవరైనా వచ్చి ప్రజలను చంపారా?" అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
గాంధీని హత్య చేసిన గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధానిని, బీజేపీ నేతలను అడుగుతున్నానని చెప్పారు. ఇప్పుడు గాడ్సేపై ఓ సినిమా తెరకెక్కుతోంది. గాడ్సేపై తీస్తున్న సినిమాను పీఎం బ్యాన్ చేస్తారా? గాడ్సే సినిమాపై నిషేధం విధించాలని బీజేపీకి డిమాండ్ చేశారు."ఢిల్లీలో 'జీ20 ఇన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ' అనే క్యాప్షన్తో జీ20 పోస్టర్లు ఉన్నాయి. YouTubeలో నిషేధం (BBC డాక్యుమెంటరీపై) ఉంది. గాడ్సే, సావర్కర్ మధ్య విభిన్నమైన ప్రేమ ఉండేది. గాంధీ హత్యకు గురైన జనవరి 30లోపు గాడ్సేపై సినిమాను నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నాం" అని అన్నారు.
ప్రధాని మోడీ కి సంబంధించిన రెండు భాగాల బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకోవడంతో, ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకున్న చర్యపై దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం దీనిని "ప్రచార భాగం"గా పేర్కొంది. బహుళ యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్లను నిరోధించడానికి ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్షిప్పై ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. "ఈ తుక్డే తుక్డే ముఠా సభ్యుల నుంచి ఇంతకంటే మంచి ఏమీ ఆశించలేము" అని అన్నారు.