స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
Recommended Video

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సెషన్స్ మొదలైన వెంటనే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్. స్పీకర్ గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా స్పీకర్ ఛెయిర్ లో కూర్చోబెట్టారు. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆయనను సాదరంగా స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు పోచారం. సీఎం కేసీఆర్ సహా సభ్యులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఫ్యామిలీ నేపథ్యం
పోచారం శ్రీనివాసరెడ్డి అసలు పేరు పరిగె శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందినవారు కావడంతో ఊరి పేరే ఇంటిపేరుగా మారింది.
1949, ఫిబ్రవరి 10న పరిగె రాజిరెడ్డి, పాపమ్మ దంపతులకు జన్మించిన శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కావడంతో రాజకీయంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఎవరి ఆశీస్సులు లేవు. స్వయంకృషితో రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు.

సీనియర్ నేత.. ఆరుసార్లు ఎమ్మెల్మే
1976లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పోచారం వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తొలినాళ్లలో టీడీపీ నేతగా ప్రజాదరణ పొందారు.
1984 నుంచి 2011 వరకు దాదాపు 27 సంవత్సరాల పాటు టీడీపీలో కొనసాగారు. జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీకి సేవలందించారు. అయితే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు చేరుకోవడంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం దక్కింది. టీఆర్ఎస్ అధినేతకు సన్నిహితుడిగా ముద్రపడ్డ పోచారం.. గులాబీ వనంలో మచ్చలేని నాయకుడిగా ముద్ర వేసుకున్నారు.

అంచెలంచెలుగా స్పీకర్ దాకా..!
1987లో డీసీసీబీ ఛైర్మన్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి... 1994లో బాన్సువాడ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. గృహ నిర్మాణ, గనులు, పంచాయతీరాజ్ శాఖలను నిర్వర్తించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. అలా సుదీర్ఘంగా సాగిన పోచారం ప్రస్థానంలో ఇప్పుడు స్పీకర్ పదవి వరించింది. ఇంత సవ్యంగా సాగిన ఆయన రాజకీయ జీవితంలో ఒడిదొడుకులు తప్పలేదు. 1989లో టీడీపీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఓటమి చెందారు.












Click it and Unblock the Notifications