Double Bedroom: పత్రాలు ఇచ్చినా ఇళ్లలోకి పోనివ్వడం లేదు.. లబ్ధిదారుల ఆవేదన..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ లబ్ధిదారుల పరిస్థితి గందరగోళంగా మారింది. లబ్ధిదారులకు ఇల్లు పత్రాలు ఇచ్చినా.. వారు ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నారు. అధికారులు లబ్ధిదారులకు ఇంకా తాళాలు ఇవ్వలేదు. తాళాలు ఇవ్వాలని కోరినా.. తమకు పై నుంచి తాళాలు ఇవ్వొద్దని ఆదేశాలు ఉన్నట్లు వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 70 వేల ఇళ్లను మాత్రమే అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ 70 వేల ఇళ్ల కనీ సౌకర్యాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఒక కొల్లూరులో 15, 660 ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లలో ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇళ్లలోకి లబ్ధిదారులకు అనుమతి ఇస్తాలేనట్లు సమాచారం.
పట్టాలిచ్చారని సంతోషపడుతున్న లబ్ధిదారులను ఇండ్లలోకి రానివ్వకపోవడంతో తమ సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యమైతే తమ కేటాయించిన ఇళ్లు వేరే వారికి వెళ్తాయని భయపడుతున్నారు. అయితే ఇళ్ల కేటాయింపులో ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వారికే ఎక్కువ ఇళ్లు వచ్చాయని తెలంగాణకు చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లో కొన్నింటిలో తప్పులు ఉండటంతో వాటిని సరిచేసుకోడానికి తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కొందరి ఇళ్ల పత్రాల్లో కులం, ఆధార్ నంబర్, పేర్లు తదితర తప్పులు పడటంతో ఆ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. అన్నీ సరిచేసుకొని వచ్చిన తర్వాతనే ఇండ్లను అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొంత మేర జరిగినప్పటికీ.. జిల్లాల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రచారానికి ఊళ్లలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.
చాలా మంది తమకు డబుల్ బెడ్ ఇళ్లు రాలేదని చెబుతున్నారు. జిల్లాల్లోని కొన్ని ఊళ్లు ఇంత వరకు ఒక్క డబుల్ బెడ్ ఇళ్లు కూడా రాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications