హైదరాబాద్లో కల్లోల పరిస్థితి... రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా కేసీఆర్...
రోమ్ నగరం తగలబడుతుంటే... నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఓవైపు కరోనా పేషెంట్లు మరణిస్తుంటే... అదేమీ పట్టకుండా కేసీఆర్ హరితహారం సమీక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్,ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం(జూన్ 30) భట్టి మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్లో కల్లోలం...
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం హైదరాబాద్లో కల్లోల పరిస్థితి నెలకొందన్నారు భట్టి విక్రమార్క. ఎప్పుడు ఎక్కడ కరోనా వైరస్ విజృంభిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగికి ఆక్సిజన్ దొరకని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని... ఆ విషయాన్ని సెల్ఫీ వీడియోతో బయటపెడితే మంత్రి ఈటల తప్పు పట్టడం సరికాదన్నారు.

ఈటలను తప్పు పట్టిన భట్టి...
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల మానవత్వంతో ఆలోచించడం లేదన్నారు భట్టి విక్రమార్క. ఆస్పత్రిలో పరిస్థితులపై వీడియోలో చెప్పడం న్యాయమా అని అడగడం సరికాదన్నారు. మానవత్వం ఉన్నవాళ్లెవరూ అలా ప్రశ్నించరన్నారు. ఒక సామాన్యుడికి కరోనా సోకితే ఎక్కడికెళ్లి చికిత్స చేయించుకోవాలో తెలియని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. ఇకనైనా భేషజాలకు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Recommended Video

900కి తగ్గని కేసులు...
తెలంగాణలో గత కొద్దిరోజులుగా వరుసగా 900 పైనే కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం(జూన్ 30) కూడా 945 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8785 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కు చేరింది.












Click it and Unblock the Notifications